భోపాల్: విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ అధికారిపై స్థానికులు విచక్షణారహితంగా దాడి చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్పూర్ జిల్లా జామ్తులి గ్రామంలోని కొందరు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే దుకాణాలను మూసివేయాలని హెచ్చరించారు. అయితే దుకాణదారులు పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా ఎదురుతిరిగారు.
దాంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఓ పోలీస్ అధికారి కొట్టిన దెబ్బకు స్థానికుడి తలకు గాయమై రక్తం వచ్చింది. ఇదే అదనుగా గ్రామస్తులు ఆ పోలీస్ అధికారిపై పడి విచక్షణారహితంగా కొట్టారు. కర్రలతో మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను జాతీయ మీడియా సంస్థ ట్విటర్లో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్గా మారింది.