హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్కు చెందిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గవర్నర్కోటాలో ఇటీవల ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారుచేస్తూ ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్కు సిఫారసు చేసింది. ఆమోదం కోసం సంబంధిత ఫైల్ను రాజ్భవన్కు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపాక కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి గతనెల 21న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘కౌశిక్రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నది. ఆయన హుజూరాబాద్ నియోజకవర్గానికో, కరీంనగర్ జిల్లాకో పరిమితం కాడు. నేను ఆయన భవిష్యత్తుకు మార్గం ఏర్పాటు చేస్తా’ అని హామీఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. కౌశిక్రెడ్డికి నామినేటెడ్ ఎమ్మెల్సీ ప్రకటించడంపై హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు సంబురంలో మునిగిపోయాయి.
క్రీడాకారుడిగా.. యువనేతగా.. ఎమ్మెల్సీగా
కౌశిక్రెడ్డి రాజకీయనేతగా మారిన క్రీడాకారుడు. ఆయన క్రికెట్లో రంజీప్లేయర్. దులీప్, రంజీట్రోఫీలో ఆడారు. కపిల్దేవ్ గతంలో స్థాపించిన ‘ఇండియన్ క్రికెట్లీగ్’లోనూ ప్రాతినిధ్యం వహించారు. క్రికెట్కు వీడ్కోలు పలికాక 2009లో తన నాయనమ్మ పేరుమీద ‘పుష్పమాలాదేవి మెమోరియల్ ట్రస్ట్’ నెలకొల్పి సమాజసేవ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో యువతను క్రీడలవైపు మళ్లించేందుకు క్రికెట్, వాలీబాల్, హాకీ టోర్నమెంట్లు నిర్వహించారు. మెడికల్ క్యాంపులు, కంటిపరీక్షలు చేయించారు. పలువురు పేద విద్యార్థులకు పైచదువులకు ఫీజులు చెల్లించడం, ఉచితంగా పుస్తకాలు, విద్యాసామగ్రిని అందించడం వంటివిచేశారు. వీణవంక మండల కేంద్రంలో నాయనమ్మ, తాత పేర్లమీద బస్టాండ్ను నిర్మించారు. దేవాలయాల నిర్మాణానికి భూములు, డబ్బును విరాళంగా ఇచ్చారు. పేదింటి ఆడపడుచుల పెండ్లిండ్లకు సహాయంచేశారు. పేదల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. పీసీసీ కార్యదర్శిగా, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగమయ్యేందుకు గత నెల 21వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.