ఇండస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులను మోసగించినందుకు చీటింగ్ కేసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.383 కోట్ల రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించకపోవడంతోపాటు ఆ నిధులను పక్కదారి పట్టించారన్న అభియోగాలతో ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ 2019లో సెక్యూరిటీలు, బ్యాంకు గ్యారంటీల ద్వారా ఇండస్ఇండ్ బ్యాంకు నుంచి రూ.185 కోట్ల రుణాన్ని పొంది తిరిగి చెల్లించలేకపోయింది. వీటిలో దాదాపు రూ.138 కోట్లను నిధులను అక్రమంగా ఇతర సంస్థలకు మళ్లించి దుర్వినియోగం చేసినట్టు ఇండస్ ఇండ్ బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం తమ రుణాలను ఎగ్గొట్టిన కార్వీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. అంతేకాకుండా కార్వీ తన క్లయింట్ల షేర్ల ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్వీపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
హెచ్డీఎఫ్సీకి రూ.246 కోట్లు
కార్వీ డైరెక్టర్లు కమాండర్ పార్థసారథి, శివరామకృష్ణ ముళ్లపురి, రాజత్ పార్థసారథి, సుశీల్కుమార్ తమకు రూ.246 కోట్లు ఎగ్గొట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిఫ్యూటీ వైస్ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యగారి నెల రోజుల క్రితం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా 2019 సెప్టెంబర్లో షేర్లు తనఖాపెట్టి రూ.350 కోట్ల రుణాలు తీసుకున్నారని, వాటిలో రూ.208 కోట్లు తిరిగి చెల్లించలేదని వివరించారు. ఈ సొమ్ముకు వడ్డీలు, ఇతర రుణ బాకీలు కలిపి రూ.38 కోట్ల వరకు ఉంటాయని, మొత్తగా వారి నుంచి రూ.246 కోట్లకుపైగా రావలసి ఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారంపై కూడా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.