జగదేవ్పూర్, మే 17: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల శివాలయం వద్ద సోమనాథ దేవాలయ శిథిలాలు వెలుగుచూశాయి. కాకతీయుల కాలం నాటి రాతిశిల్పాలు, శాసనాలు, మహిషాసురమర్ధిని, నాగదేవత, నాగశిలలు 8, 9వ శతాబ్దాల కాలం నాటి నంది దేవతల తలలుగల పీఠం బయల్పడినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు మచ్చ ప్రణయ్కుమార్ తెలిపారు. శాసనాన్ని క్రీ.శ. 1148లో మొదటి కాకతీయులకు చెందిన గుండరాజు హరరాజు వేయించారని తెలుస్తుందన్నారు. ఈ శాసనాల గురించి మెదక్ జిల్లా శాసన సంపుటిలోని 126వ శాసనం పేజీ నంబర్ 223లో ఉన్నదని చెప్పారు. శివాలయంలో నేల మీదున్న చతురస్రాకారపు పానవట్టం నడుమ అండాకారపు లింగం ప్రతిష్ఠితమై ఉన్నదని తెలిపారు. దేవాలయం కప్పులో అమర్చే అష్టకోణయంత్ర పుష్పఫలకాలు రెండున్నాయన్నారు. బయట ఒక గ్రానైట్ రాతిసలప మీద దేవతామూర్తి అర్ధ శిల్పం ఉండగా, ఈ దేవత పైచేతుల్లో కత్తి, డాలు ఉన్నాయని.. ముందు కుడిచేతిలో శూలం ఉన్నదని వెల్లడించారు. సింహంపై కూర్చున్నట్టుగా ఉన్న ఆమె మహిషాసురమర్ధిని అవతారంలో దర్శనమిస్తున్నట్టు తెలిపారు. మరో సలపపై నాగదేవతా శిల్పం ఉన్నదని, గుడి ప్రాంగణంలో మూడు నాగశిలలు ఉన్నట్టు వెల్లడించారు. మరొక దేవతాదిష్ఠాన పీఠంపై 8 మంది దేవతల తలలు చెక్కి ఉన్నాయని తెలిపారు.