కరీంనగర్ : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ISRO ) నిర్వహించే ఐదు రోజుల వెబినార్కు కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు షరీఫ్ అహ్మద్ ఎంపికయ్యారు. ఇస్రో శాస్ర్తవేత్త డాక్టర్ హరీష్ చంద్ర నుంచి ఆదివారం సాయంత్రం తనకు మెయిల్ వచ్చినట్లు షరీఫ్ తెలిపారు. మే 31వ తేదీ నుంచి జూన్ 4 వరకు జరిగే వెబినార్లో పాల్గొనాలని మెయిల్లో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ వెబినార్లో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం – వాటి అనువర్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణం, శీతోష్ణస్థితులపై అధ్యయనంతో పాటు తదితర అంశాలపై శిక్షణ అందించనున్నారు.
చిగురుమామిడి మండలంలోని రామంచ ప్రభుత్వ పాఠశాలలో షరీఫ్ హిందీ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎంపికైన అతికొద్ది మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో షరీఫ్ ఒకరు. షరీఫ్ ఇస్రో వెబినార్కు ఎంపిక కావడం పట్ల ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.