ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కల నెరవేరింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అధునాతన వసతులతో నిర్మించిన డబ్బుల్ బెడ్రూం
ఇండ్లలోకి అడుగుపెట్టిన లబ్ధిదారుల సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. గురువారం సాయిచరణ్ కాలనీ, అంజయ్యనగర్, సుభాష్చంద్రబోస్ నగర్, ధోబీఘాట్ బస్తీల్లో పడుగ వాతావరణం తలపించింది. డబుల్ ఇండ్లను ప్రారంభించిన మంత్రులు తలసాని, మహమూద్అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవ సౌధాల్లో అపరిశుభ్రతకు తావులేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. మొక్కలు నాటి.. నీరు పోశారు. ప్రజలంతా హరిత సంపద పెంచాలని పిలుపునిచ్చారు.
నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవాల పరంపర కొనసాగుతోంది. పదిరోజుల వ్యవధిలోనే 754 ఇండ్ల పంపిణీ పూర్తికాగా, గురువారం నాలుగుచోట్ల ఆధునిక హంగులతో నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. సీతాఫల్మండి డివిజన్ సుభాష్చంద్రబోస్ నగర్లో 60, మెట్టుగూడ డివిజన్ ధోబీఘాట్లో 207, అడిక్మెట్ డివిజన్ సాయిచరణ్ కాలనీలో 108, భోలక్పూర్ డివిజన్ అంజయ్యనగర్లో 35 ఇండ్లను గురువారం మంత్రులు మహమూద్అలీ, తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించారు.
అనంతరం లక్కీడ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు. గత ప్రభుత్వాలు 30 శాతం ఖర్చును భరిస్తే ఇండ్లు నిర్మించేవని, తమ ప్రభుత్వం పైసా తీసుకోకుండా సకల సౌకర్యాలతో ఉచితంగా నిర్మించి ఇస్తున్నదని చెప్పారు. ఇండ్ల కేటాయింపులో ప్రమేయం లేకుండా లబ్ధిదారుల సమక్షంలో డ్రా తీసి పారదర్శకంగా అందిస్తున్నామని చెప్పారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ముషీరాబాద్/ కవాడిగూడ, జూలై 8 : గత ప్రభుత్వాలు 30శాతం లబ్ధిదారుల వద్ద వసూలు చేసి ఇరుకైన ఇండ్లు కట్టిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం ఒక్కపైసా కూడా తీసుకోకుండా అధునాతన వసతులతో గౌరవప్రథంగా ఉండేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు అందజేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం అడిక్మెట్ డివిజన్ సాయిచరణ్ కాలనీలో 108, భోలక్పూర్ డివిజన్ అంజయ్యనగర్లో నిర్మించిన 35 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ప్రారంభించారు. అనంతరం లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపికచేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో ఎవరి ప్రమేయం లేకుండా లబ్ధిదారుల సమక్షంలోనే డ్రా తీసి పారదర్శకంగా అందించడం జరుగుతుందని అన్నారు. ఉచిత మంచినీటి వసతి కల్పిస్తూ సకల సౌకర్యాలతో నిర్మించిన ఇండ్ల నిర్మాణ సముదాయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చుట్టూ మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు.
పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించడంతో పాటు.. ఆడపిల్లల పెండ్లికి ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో పోటీపడాలని, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ వసంతకుమారి, అడిక్మెట్, భోలక్పూర్ డివిజన్ల కార్పొరేటర్లు సి.సునీతాగౌడ్, గౌసుద్దీన్, జీహెచ్ఎంసీ సీఈ సురేశ్, ఈఈ వెంకట్దాస్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ, మాజీ కార్పొరేటర్ బి.హేమలతారెడ్డి, టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్.శ్రీనివాసరావు, ముషీరాబాద్ తాసీల్దార్ జానకి, ముఠా జయసింహ, శ్యామ్సుందర్, సురేందర్, బి.శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్, జూలై 8 : అభివృద్ధి, సంక్షేమంలో సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రథమస్థానంలో నిలుస్తున్నదని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండి డివిజన్లోని సుభాష్చంద్రబోస్ నగర్లో 60, మెట్టుగూడ డివిజన్ ధోబీఘాట్లో 207 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో రైల్వేశాఖ, ఉస్మానియా యూనివర్సిటీలు ఉండటంతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి స్థల కొరత తప్పడంలేదని అన్నారు.
అయినప్పటికీ సుభాష్చంద్రబోస్నగర్, దోబీఘాట్లలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే సాయినగర్, ఆజాద్ చంద్రశేఖర్నగర్లలో కూడా డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని అర్హులైన పేదలకు నగర శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కిషన్, శ్రీనివాస్రెడ్డి, సురేశ్, మోహన్రెడ్డి, వెంకటదాస్రెడ్డి, ఆశలత, సునీల్, వెంకటరమణ, మోతె శోభన్రెడ్డి, కార్పొరేటర్ కంది శైలజ, నేతలు కిశోర్గౌడ్, రామేశ్వర్గౌడ్, కంది నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న సాయిచరణ్ కాలనీ వాసుల సొంతింటి కలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీర్చింది. కోట్లాది రూపాయల వ్యయంతో అధునాతన వసతులు కల్పించి నిర్మించిన ఇండ్లను పేదలకు ఉచితంగా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఇండ్లు పొందిన లబ్ధిదారులు గృహసముదాయ నిర్వహణను సక్రమంగా చేపట్టాలి. అపరిశుభ్రతకు తావులేకుండా చూసుకోవాలి.- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నగరం రోజురోజుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి సాధిస్తున్నదని, ఇందుకు తగినట్లుగా ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రత పట్ల శ్రద్ధపెట్టాలని సూచించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులు నిర్వహణను సక్రమంగా చేపట్టాలని తెలిపారు. -నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
కరోనా విపత్కర పరిస్థితుల్లో లక్ష కోట్ల మేర నష్టం వాటిల్లినా.. సంక్షేమ పథకాలకు ఎక్కడా ఆటంకం కలుగకుండా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. నగరంలోని పేదల బస్తీల్లో నాణ్యతతో కూడిన ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, రాజకీయాలకు తావులేకుండా లబ్ధిదారులకు ఇండ్లు కేటాయిస్తున్నామని తెలిపారు. – హోంమంత్రి మహమూద్ అలీ