హుజూరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్కు వ్యాపార అభివృద్ధి తప్ప, ప్రజాసేవ అలవడలేదని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు విమర్శించారు. అత్మగౌరవం అంటే వ్యాపారాలను పెంచుకోవడమేనా అని ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గొప్ప వ్యక్తిత్వం గల పార్టీ అధినేత, సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్లోనే ఉండి అధినేతపై, పార్టీపై విమర్శలు చేయడం క్రమశిక్షణా రాహిత్యం కాదా అని ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం చేసినవారిని చెత్త బుట్టలో వేసిన సంగతి గుర్తుంచుకోవాలని హితవుపలికారు. 18 ఏండ్ల ప్రజాజీవితం తర్వాత కూడా రాజేందర్ ప్రజాప్రతినిధిగా మారలేదని, పేదల భూములనే కాజేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ బీఫాంలపై గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు వార్డు సభ్యులు, ఇతర చైర్మన్లు, డైరెక్టర్లు పార్టీలోనే కొనసాగడం కేసీఆర్ న్యాయకత్వాన్ని సమర్ధించడమేనని, అమ్ముడు పోవడం ఎలా అవుతుందని నిలదీశారు. అభినవ పూలేనని సొంత మనుషులతో అనిపించుకొనే ఆయనకు బడుగుల భూములు ఎందుకు అని ప్రశ్నించారు. తొండలు గుడ్లు పెట్టని ఆ బడుగుల భూముల్లో కోళ్లు గుడ్లు ఎలా పెడుతున్నాయని అన్నారు. సమావేశంలో హుజూరాబాద్ జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండల్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణశాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, కల్లెపల్లి రమాదేవి, నాయకులు పంజాల కుమారస్వామి, పొనగంటి మల్లయ్య, మొలుగూరి ప్రభాకర్, భూసారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.