న్యూఢిల్లీ: ఇప్పటికే అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ ధాటికి పశ్చిమతీరం అతలాకుతలం అయ్యింది. తౌటే ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకముందే.. ఇప్పుడు తూర్పు తీరానికి మరో తుఫాన్ ముంచుకొస్తున్నది. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 25 కల్లా తీవ్ర తుఫాన్గా మారనుంది. ఈ రాబోయే తుఫాన్కు యాస్ అని పేరుపెట్టారు. ఈ యాస్ తుఫాన్ మే 26-27 తేదీల్లో తూర్పు తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన 72 గంటల్లో అది మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉందని, అది వాయువ్య దిశగా కదులుతూ మే 26 నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశముందని ఐఎండీ తుపాను హెచ్చరికల విభాగం తెలిపింది. ఈ యాస్ తుఫాన్ ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, బెంగాల్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది.