మార్కెట్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో కందిని పూర్తిస్థాయి పంటగా సాగుచేస్తే మంచి లాభాలు వస్తాయి. నీటి పారకంతో రెట్టింపు దిగుబడి పొందవచ్చు. ఆశ, టీడీఆర్జీ (హనుమ), పీఆర్జీ-170, డబ్ల్యూఆర్జీ-93 రకాలతో మంచి దిగుబడి వస్తుంది.
–సీ సుధాకర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ తాండూరు అగ్రి రీసెర్చ్ సెంటర్
వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన రైతు గండ్ల నర్సింలు కంది సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. కందిని పూర్తిస్థాయి పంటగా సాగుచేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. విత్తనాలు చల్లేపద్ధతి కాకుండా సాళ్లలో విత్తే పద్ధతిని పాటిస్తున్నారు. ఈ పద్ధతిలో ముందుగా మూడు ఫీట్ల దూరంలో రెండు విత్తనాల చొప్పున కందులను విత్తుతారు. అవి మొలకెత్తాక మంచిగా మొలకెత్తిన మొక్కను ఉంచి.. బాగా మొలకెత్తని మొక్కను తీసేస్తారు. పూత, కాత దశలో రెండు లేదా మూడుసార్లు నీళ్లు పారిస్తారు. తద్వారా ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నారు. నర్సింలు ఉత్తమ రైతు అవార్డు కూడా పొందారు.
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కంది అనగానే వర్షాధార పంటగా.. పత్తి, మక్క సాళ్లలో వేసే అంతర్పంటగా, ఇంటి అవసరాలకు సరిపోను వరి పొలం గట్లపై విత్తుకునే పంటగానే భావిస్తుంటారు. తరి భూముల రైతులు దాని సాగువైపు కన్నెత్తికూడా చూడరు. కానీ, పరిస్థితులు మారాయి. కందిని వర్షాధారంగా కాకుండా.. పూర్తి స్థాయి పంటగా సాగుచేయాల్సిన సమయం వచ్చింది. మార్కెట్లో కందులకు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. కందులను పండించే రైతుకు కాసులు కురిపిస్తున్నది. ఒక్కసారిగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఆ పంట సాగును ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. దీంతో రాష్ట్రంలో క్రమంగా కంది విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. 2019-20 వానకాలంలో 7.38 లక్షల ఎకరాల్లో కంది వేయగా.. గతేడాది 10.84 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక ఈ ఏడాది కంది సాగు అంచనాను ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఏకంగా 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రంలో రెండు మూడుచోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో కంది అంతరపంటగానే సాగవుతున్నది. కానీ, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో రైతులు కందిని పూర్తిస్థాయి పంటగా సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వికారాబాద్లో రైతులు కందినే ప్రధాన పంటగా సాగుచేస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది సాగయిన 10.84 లక్షల ఎకరాల్లో వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లోనే 5 లక్షల ఎకరాలు ఉన్నది. వికారాబాద్ జిల్లాలోనే 1.85 లక్షల ఎకరాల్లో వేశారు. నారాయణపేటలో 1.37 లక్షలు, సంగారెడ్డిలో 1.08 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.
మక్కను ప్రధాన పంటగా.. కందిని అంతర్పంటగా సాగుచేస్తూ రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. కందిని అంతర పంటగా వేస్తే ఎకరాకు రెండు క్వింటాళ్లకు మించి దిగుబడిరాదు. పూర్తిస్థాయి పంటగా సాగుచేయడం వల్ల సగటున 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దీంతో రూ.30 వేల- 36 వేల వరకు ఆదాయం వస్తుంది. డిమాండ్లేని మక్కలను రూ.వెయ్యి నుంచి రూ.1,200లకు మాత్రమే అమ్ముకోవాల్సి వస్తున్నది. కాబట్టి మక్కల కంటే కందిని వేయాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పైగా రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో కందిని వర్షాధారంగా కాకుండా నీటి తడులతో సాగుచేస్తే రెట్టింపు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. పూత, కాత దశలో రెండు లేదా మూడుసార్లు నీళ్లు పారిస్తే చాలు.. సాధారణ దిగుబడికి సుమారు 3-4 క్వింటాళ్ల దిగుబడి అధికంగా వస్తుంది. వర్షాధారంగా సాగుచేస్తే ఎకరాకు చెల్క భూముల్లో 3-4 క్వింటాళ్లు, రేగడుల్లో 6-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రెండుతడుల నీళ్లు పారిస్తే చెల్కల్లో 6-8 క్వింటాళ్లు, రేగడుల్లో 10-12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
కందులకు మార్కెట్లో మద్దతు ధరకు మించి ధర లభిస్తున్నది. దీంతో కంది ‘రంది’ లేని పంటగా మారింది. పంట అమ్ముకొనేందుకు ప్రభుత్వం వైపు చూడాల్సిన అవసరం లేకుండా ప్రైవేటు వ్యాపారులే పోటీపడి కొంటున్నారు.. గత వానకాలంలో మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి ఏకంగా 3 లక్షల టన్నుల కందులను కొనుగోలు చేశారు. కందులకు మద్దతు ధర క్వింటాల్కు రూ.6 వేలు కాగా.. గతేడాది వికారాబాద్ మార్కెట్లో గరిష్ఠంగా రూ.7,200 పలికింది. ఈ ఏడాది కందులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను రూ.300 పెంచి.. రూ.6,300 చేసింది. సగటున ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా రూ.50 వేలు వస్తాయి. పెట్టుబడి ఖర్చులుపోను రూ. 30-35 వేల వరకు రైతుకు ఆదాయం వస్తుంది.