న్యాల్కల్, జూన్ 25 : సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఆత్నూర్ గ్రామానికి చెందిన రైతు యాదయ్య కంది పంట సాగు చేస్తున్నారు. నర్సరీ పద్ధ్దతిలో.. సేంద్రియ ఎరువులు వాడుతూ.. డ్రిప్ ద్వారా పంటకు సాగునీరు అందిస్తూ.. మంచి దిగుబడులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. యాదయ్య కంది చేనును శుక్రవారం మండల వ్యవసాయాధికారి లావణ్య, ఆత్మ బీటీఎం చరణ్, ఏటీఎం అజ్మత్తో కలిసి సందర్శించి నాటి న మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆత్మ ఆధ్వర్యంలో నర్సరీ పద్ధ్దతిలో కొత్తగా కంది పం ట సాగు చేసేందుకు యాదయ్య ముందుకు వచ్చారని చెప్పారు. ఎండు తెగుళ్లు సమర్థవంతంగా తట్టుకునే బీఎస్ఎంఆర్-736 రకం కంది విత్తనాన్ని అందించామని తెలిపారు. తమ సూచనలు, సలహాల మేరకు సంప్రదాయ పద్ధ్దతిలో కాకుండా రైతు నర్సరీ పద్ధతిలో కంది నారును పెంచాడని చెప్పారు. నర్సరీలో 30 నుంచి 40 రోజుల వరకు నారుగా పెంచారని, ఆ తర్వాత రైతుకు చెందిన 30 గుంటల పొలంలో రెండు వేల వరకు మొక్కలు నాటారని తెలిపారు. పంటకు సేంద్రియ ఎరువులను వాడటమే కాకుండా రోజూ డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారని తెలిపారు. పంట సాగుకు సాధారణంగా 180 రోజులు పడుతుందని, కానీ ఈ విధానంలో 40 రోజులు మందుగానే కంది పంట చేతికి వస్తుందని చెప్పారు. ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు.
వ్యవసాయశాఖ, ఆత్మ అధికారుల సూచనలు, సలహాల మేరకు నా పొలంలో నర్సరీ పద్ధ్దతిలో కంది సాగును మొదలుపెట్టాను. ముందుగానే నర్సరీలో నారును పెంచి చేనులో నాటా. కలుపు, తెగుళ్లు, చీడపురుగుల నివారణ ఈ విధానంలో ఎంతో సులభం. పంట సాగుకు పెట్టుబడి కూడా చాలా వరకు తగ్గింది. వర్షాధారంగా సాగు చేసిన పంట అతంత మాత్రంగానే దిగుబడి వస్తుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం ద్వారా మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా.
–యాదయ్య, రైతు, ఆత్నూర్ (న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా)