హైదరాబాద్ : కంచి కామకోటి పీఠంలో జరుగుతున్న శ్రీవిద్యా యాగంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ కంచి కామకోటి పీఠం (ధర్మాధికారి ) శ్రీకార్యం బ్రహ్మ శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి, పీఠం ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రమణ్య శాస్త్రి మంగళవారం సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు. ప్రగతిభవన్లో సీఎంను కలిసిన వీరు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న సంప్రదాయ పాఠశాల, ఇతర కార్యకలాపాల కోసం హైదరాబాదులో స్థలం కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. అనువైన చోట పీఠానికి స్థలం ఇవ్వడానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠం కార్యకలాపాల గురించి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.