చివ్వెంల/ ఆత్మకూర్ (ఎస్) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంలా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల, ఆత్మకూర్(ఎస్) మండలాల్లోని పలు గ్రామాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల ఇండ్లకు గురువారం వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం తండ్రిగా, మేనమామగా ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.