రాష్ర్టాలకు నష్టపరిహారం పెంపు, వ్యాక్సిన్లపై జీఎస్టీ రద్దుపై చర్చించే అవకాశం
న్యూఢిల్లీ, మే 15: ఏడు నెలలుగా సమావేశంకాని జీఎస్టీ కౌన్సిల్ ఎట్టకేలకు ఈ నెల 28న భేటీ కానున్నది. జీఎస్టీ కౌన్సిల్ను సమావేశ పర్చాలంటూ పలు రాష్ర్టాలు కోరుతున్న నేపథ్యంలో సమావశపు తేదీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కరోనా సంక్షోభం, లాక్డౌన్లతో పలు రాష్ర్టాల్లో జీఎస్టీ వసూళ్లు పడిపోవడంతో కేంద్రం ఎక్కువ పరిహారాన్ని ఇవ్వాల్సిరావడం, వ్యాక్సిన్లు, ఇతర కీలక వైద్య ఉత్పత్తులపై జీఎస్టీని రద్దుచేయాలంటూ రాష్ర్టాలు డిమాండ్ చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ‘43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యూఢిల్లీలో మే 28న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది’ అంటూ ఆర్థిక శాఖ ట్వీట్లో పేర్కొంది. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్రం, రాష్ర్టాల సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొంటారని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.