హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తినిచ్చిన ప్రజాకవి కాళోజీని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాం స్కృతికశాఖ ఆద్వర్యంలో తెలంగాణ భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణకు కాళోజీ పురస్కార ప్రదానంచేశారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ తొలిపొద్దు కాళోజీ అని కొనియాడారు. ప్రజాకవిగా అలుపెరగని పోరాటం చేసిన గొప్పకవి కాళోజీ అని ఘనంగా నివాళులు అర్పించారు. ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప ప్రజాకవి అని, ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించి, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయిన మహానుభావుడని కొనియాడారు. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేయడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ మాతృభాషను గౌరవించారని గుర్తుచేశారు. కవులు, కళాకారులకు గుర్తింపునివ్వడంలో భాగంగా 500 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించారని చెప్పారు. అందరికీ పేరుపేరునా తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. నిజాం సర్కారు వరంగల్ నుంచి బహిష్కరించినా, రెండుసార్లు జైలుకు పంపించినా ఏ మాత్రం భయపడకుండా తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కవిత్వాన్ని, ప్రజా ఉద్యమాలను ఆపబోనని ప్రకటించిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. ఆయన జీవితం, కవిత్వం, ఎన్నో ప్రజా ఉద్యమాలు, ఉద్యమకారుల గుండెల్లో నిండిపోయాయని చెప్పారు. కాళోజీ కవితలకు ముఖ్యమంత్రి కేసీఆర్ భాష, యాసలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ వరంగల్లో కాళోజీ యూనివర్సిటీ, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి చర్యలు చేపట్టారన్నారు. అలాగే ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి గౌరవించుకున్నారన్నారు. ఎమ్మెల్సీ, గోరటి వెంకన్న, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిందంటే కాళోజీ స్ఫూర్తితోనే అని అన్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ కాళోజీ సాహిత్యరంగానికి చేసిన సేవలు మరవలేనివన్నారు. అనంతరం ప్రముఖ సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణకు ఈ ఏడాది కాళోజీ పురస్కారం అందజేసి సత్కరించారు.
పురస్కార గ్రహీత పెన్నా శివరామకృష్ణ మాట్లాడుతూ.. కాళోజీ చెప్పిన ‘పుటుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అనే మాట ఇతరులకు ఎంత వర్తిస్తుందో తెలియదు కానీ.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన కాళోజీకి మాత్రం బాగా వర్తిస్తుందని చెప్పారు. వచన కవిత్వం, గజల్, హైకూ, రుబాయిలు తదితర ప్రక్రియల్లో తాను యథాశక్తి కృషిచేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాం స్కృతికశాఖల కార్యదర్శి శ్రీనివాసరాజు, గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ శ్రీధర్, సాంస్కృతికశాఖ సంచాలకుడు హరికృష్ణ పాల్గొన్నారు.