బడ్జెట్లో రూ.960 కోట్లు కేటాయింపు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో జిల్లా సస్యశ్యామలం
రెండేండ్లలో జిల్లాలోని 3.59 లక్షల ఎకరాలకు నీరు..
లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్, పంప్హౌస్ నిర్మాణానికి పూర్తయిన సర్వే పనులు
టెండర్ల ప్రక్రియకు కసరత్తు.. ఆ తరువాత భూ సేకరణ..
రంగారెడ్డి, మార్చి 19,(నమస్తే తెలంగాణ) : రైతులకు పుష్కలంగా సాగునీరు అందించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై దృష్టి సారించింది. రూ.43వేల కోట్ల అంచనా వ్యయంతో పనులను ముమ్మరం చేసింది. అంతేకాకుండా తాజాగా బడ్జెట్లో రూ.960 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రంగారెడ్డి జిల్లాలోని 3,59,046 ఎకరాలకు సాగునీరు అందనున్నది. జిల్లాకు నీరందించేందుకు లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్, పంపుహౌస్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వే పనులు పూర్తికాగా.. చిన్న కాలువల సర్వే తుది దశకు చేరుకున్నది. ఈ నెలాఖరులోగా టెండర్లను ఆహ్వానించి.. వెంటనే భూ సేకరణ చేపట్టేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అనంతరం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇందులో భాగంగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో రూ.960 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్లో రూ.400 కోట్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని నిధులను కేటాయించింది. అంతేకాకుండా గతేడాది పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.10 వేల కోట్ల రుణాలను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పొందేందుకుగాను ప్రభుత్వం అనుమతులనూ మంజూరు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ నుంచి రూ.8వేల కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో మరింత వేగం పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి కావడంతో ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రంగారెడ్డి జిల్లాకు సాగునీటిని అందించేందుకుగాను లక్ష్మీదేవిపల్లి వద్ద పనులు జోరందుకున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి జిల్లాతోపాటు మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వికారాబాద్, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందనున్నది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని పంపింగ్ చేయనున్నారు. తొలుత శ్రీశైలం నుంచి నాగర్కర్నూల్ జిల్లాలోని నార్లపూర్ రిజర్వాయర్కు తదనంతరం నాగర్కర్నూల్ జిల్లాలోని వట్టెం రిజర్వాయర్కు, ఆ తర్వాత వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్కు నీటిని ఎత్తిపోయనున్నారు. తదనంతరం మహబూబ్నగర్ జిల్లాలోని కరివెన రిజర్వాయర్కు అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లాలోని ఉద్దండపూర్ రిజర్వాయర్కు చివరగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు నీటిని ఎత్తిపోయనున్నారు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి జిల్లాకు సాగునీటిని అందించనున్నారు. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలోని 3,59,046 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
త్వరలో టెండర్లకు ఆహ్వానం…
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు జోరందుకున్నాయి. అంతేకాకుండా అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులూ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై దృష్టి సారించింది. జిల్లాతోపాటు మహబూబ్నగర్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరందించే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకుగాను ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జడ్చర్ల సమీపంలోని ఉద్దండపూర్ వద్ద రిజర్వాయర్ పనులతోపాటు పంప్హౌస్ పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లాకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీరు అందించనున్నారు.
లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్, పంప్హౌస్ పనులకు సంబంధించి ఇప్పటికే సర్వే పనులు పూర్తికాగా, చిన్న కాలువల సర్వే పనులు చివరి దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా సర్వే పనులు పూర్తి చేసి, టెండర్లను ఆహ్వానించేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే భూ సేకరణ ప్రక్రియ చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో మూడు మాసాల్లో కాలువల నిర్మాణ పనులను షూరు చేసేందుకుగాను కసరత్తు చేస్తున్నారు. ఏదేమైనా మరో రెండేండ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైతే జిల్లా రైతాంగం కష్టాలు తీరనున్నాయి. వర్షాలపై ఆధారపడి పంటలను పండించే రైతులకు సాగునీరు అందనున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో జిల్లాలోని షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలతోపాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల తదితర మండలాల్లోని 3.59 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యయం రూ.43 వేల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అన్ని విధలా నష్టపోయిన తెలంగాణ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తున్నది.
త్వరలో టెండర్లు…
పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రస్తుతం జడ్చర్ల సమీపంలోని ఉద్దండపూర్ వద్ద రిజర్వాయర్ పనులతోపాటు పంప్హౌస్ పనులు కొనసాగుతుండగా లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్, పంప్హౌస్ నిర్మాణానికి సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయి, త్వరలో టెండర్లను పిలిచి భూ సేకరణ ప్రక్రియను చేపడుతాం. భూ సేకరణ పూర్తైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.