హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం.. ఈ రోజుల్లో తెలంగాణలో ఎక్కడకెళ్లినా అందరి నోళ్లల్లో ఈ పేరే వినిపిస్తుంది. ఇంతవరకు ధార్మిక క్షేత్రంగా పరిఢవిల్లిన ఈ ప్రాంతం.. ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టుగా ప్రపంచానికి సుపరిచితమైంది. గోదావరి పరవళ్లకు కొత్తనడకలు నేర్పుతూ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు ఓ కొత్తచరిత్ర. రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ, పసిడిపంటలు పండించడమే కాకుం డా, తెలంగాణను సజీవ జలధారగా మార్చిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు విద్యార్థులకు పాఠ్యాంశంగా పరిచయం కాబోతున్నది. ‘కాళేశ్వరం’ పేరుతో 4వ తరగతి తెలుగు పుస్తకంలో ఈ పాఠ్యాంశాన్ని పొందుపరిచారు. తెలుగేతర మాధ్యమాల్లో చదువుకొంటున్న విద్యార్థుల కోసం రూపొందించిన ఈ పుస్తకాన్ని ఇటీవలే ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రచురించి విడుదల చేశారు. ఈ పాఠ్యాంశంలో కాళేశ్వర ధార్మిక వైభవంతో పాటు, నీటిపారుదల ప్రాజెక్ట్గా ప్రాముఖ్యాన్ని సైతం పరిచయం చేశారు.
తెలుగు తప్పనిసరి అమలులో భాగంగా..
తెలంగాణలో 4, 9 తరగతుల్లో తెలుగును తప్పనిసరిగా అమలుచేయాలని విద్యాశాఖ అధికారులు ఇటీవలే ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ నిబంధన అమలులోకి వచ్చింది. దీని కోసం 4,9 తరగతుల విద్యార్థుల కోసం కొత్తగా ఉచిత తెలుగు వాచకాలను రూపొందించి ముద్రించారు. ‘తేనే పలుకులు’ పేరుతో నాలుగో తరగతికి, ‘వెన్నెల’ పేరుతో 9వ తరగతికి పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పూర్తిగా తెలంగాణకు సంబంధించిన పాఠ్యాంశాలతో రూపొందించిన ఈ పుస్తకాలను ఎస్సీఈఆర్టీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ పుస్తకాలను సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూళ్లల్లోని విద్యార్థులందరికీ అందుబాటులో ఉంచారు. ఈ పాఠ్యాంశాలను తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా పిల్లలకు బోధించాల్సి ఉంటుంది.
తెలుగుభాషలో పట్టుసాధించేలా..
తెలంగాణలో నివసిస్తున్నవారంతా తెలుగుభాషలో పట్టుసాధించేలా కొత్త పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. రాష్ట్రంలో విద్యార్థులంతా మన సంస్కృతి, సాహిత్యం, చరిత్ర వైభవాలను తెలుసుకునే పాఠ్యాంశాలను కూర్పుచేశాం. తెలుగు మాతృభాషగా చదువుకుంటున్నవారితో పాటు, ఉర్దూ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, తమిళం సహా గిరిజన భాషల్లో చదువుకుంటున్నవారంతా ఈ పాఠ్యపుస్తకాల ద్వారా తెలుగుతో పాటు, తెలంగాణ వైభవాన్ని గురించి తెలుసుకోవచ్చు.