ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం ఉండటం, తెలంగాణ అంతా చుట్టివచ్చిన ఉద్యమకారుడైన పాలకుడు కేసీఆర్. కాబట్టి ఆయనకు అనేక విషయాలపై సంపూర్ణ అవగాహన ఉంది. రాష్ట్ర అవతరణ తర్వాత తొలిసారిగా బీసీ కమిషన్ను నియమిస్తూ అందులో నన్ను సభ్యునిగా నియమించారు. ఇది నాకు ఇష్టమైన పని కూడా. ఇష్టమైన పనిలో పెట్టినందుకు కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాను.
బీసీ కమిషన్ సభ్యుడిగా సంచార జాతులకు చెందిన వారి జీవితాల అధ్యయనం నా జీవితానికి అనేక పాఠాలు నేర్పింది. కొన్ని కులాల వారికి.. అసలు వారిదే కులమో, మతమో లెక్కలో లేదు. కుల సర్టిఫికెట్లు లేవు. బీసీ కులాల జాబితాలో ఉండాల్సినవాళ్లను, కమిషన్ అధ్యయనం చేసి బీసీ జాబితాలో చేర్చండి.’ అని విజ్ఞప్తులు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే వెంటనే అధ్యయనం చేయమని ఆదేశాలిచ్చారు. పాలనా యంత్రాంగాన్ని సంచారజాతులపై అధ్యయనానికి పురమాయించారు. సంచార జాతులకు సంబంధించిన విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకుపోతే వాళ్లగురించి మా కమిషన్ కంటే ఆయనే అనేక విషయాలు చెప్పారు.
బీసీ కమిషన్లో మాకిచ్చిన మూడేండ్ల కాల పరిధిలో దేశంలో ఏ కమిషన్ ఇవ్వనివిధంగా రెండు నివేదికలను ప్రభుత్వానికి అందించాం. ముస్లింలకు రిజర్వేషన్ల క్షేత్రస్థాయిలో వారి జీవనవిధానాన్ని అధ్యయనం చేసి నివేదికనిచ్చాం. సీఎం ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటుచేసి వారికి 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానించారు.ఆ తీర్మానం కేంద్ర హోంశాఖ వద్ద ఉన్నది. సంచార జాతులకు సంబంధించి బీసీ కులాల్లో చేర్చేందుకు నివేదిక ఇస్తే కేబినెట్ ఆమోదించి 17 బీసీ కులాలను, బీసీ జాబితాలో చేర్చింది. ఇప్పుడు ఆ 17 కులాల పిల్లలకు బీసీల్లో విద్య, ఉద్యోగ విషయాల్లో అన్నిరకాల సౌకర్యాలు, రిజర్వేషన్లు పొందుతున్నారు.
బీసీల అధ్యయనం, గురుకులాలు, బీసీల జీవన విధానం, సంస్కృతిపై క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు కనిపించిన విషయాలను అక్షరబద్ధం చేసిన ‘బీసీ కులాలు-సంచార జాతులు’ అన్న పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంచార జాతులకు సంబంధించి తాను అధ్యయనం చేసిన పుస్తకాలను వాళ్ల జీవన సంస్కృతులను తనపక్కన ఉన్న రాజ్యసభసభ్యులు కె.కేశవరావు, బోయినపల్లి వినోద్ కుమార్, భూపాల్రెడ్డిలకు వివరించారు. బీసీల్లోని అన్నికులాల అధ్యయనానికి సంబంధించి 2016లో జీవో ఎం.ఎస్ 19ని ప్రభుత్వం విడుదల చేసింది. ఎంబీసీ కార్పొరేషన్ కింద ఏ ఏ కులాలకు ఆర్థికసహాయం చేయాలన్న దానిపై చర్చించి 36 కులాలను గుర్తిస్తూ జీవో16ను విడుదల చేసింది. 17 సంచారజాతుల కులాలను బీసీ జాబితాలో చేరుస్తూ 2020, సెప్టెంబర్ 9న జీవో3ను విడుదల చేసింది. ఇది సంచారజాతులకు మరిచిపోలేని కానుక. అట్టడుగున పడి ఉన్న ఈ 17 కులాల బిడ్డలు చదువుకునేందుకు కావాల్సినన్ని గురుకులాలున్నాయి. ఆ గురుకులాల నుంచి బీసీ సూర్యోదయాలు భవిష్యత్ తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతాయి. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేల ఆలోచనలకు అనుగుణంగా బీసీ బిడ్డలకు నాలుగు వందల గురుకులాలను ఏర్పాటుచేసిన రాష్ట్రం తెలంగాణే. దేశంలో మరే రాష్ట్రం లో లేనివిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వెయ్యి గురుకులాలను ఏర్పాటుచేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. అందుకే కేసీఆర్ నాయకుడు మాత్రమే కాదు దార్శనికత గల విజనరీ.
(వ్యాసకర్త: జూలూరు గౌరీశంకర్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు)