హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. పూలే 195వ జయంతి (ఏప్రిల్ 11) ని పురస్కరించుకుని స్పీకర్ ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే నమ్మరాన్నారు. అదేవిధంగా అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు.
పూలే ఆశయాలకు అనుగుణంగానే నేడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానంగా విద్యను అందిస్తుందన్నారు. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మరింతగా ఎదగడమే పూలేకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.