హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో ఓ తల్లి ప్రసవ వేదన తీరింది. ఏ ఆటంకం లేకుండా ఓ పసిప్రాణం ఈ లోకంలోకి అడుగుపెట్టింది. కోస్గికి చెందిన జ్యోతిబాయి 9 నెలల గర్భిణి. డెలివరీ సమయం కన్నా ముందే నొప్పులు వచ్చాయి. రక్తం తక్కువగా ఉండటంతో తక్షణం ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. క్యాబ్ డ్రైవర్ అయిన జ్యోతిబాయి భర్తకు ఆ ఆపరేషన్ చేయించటం ఆర్థికంగా భారంగా మా రింది. ఆమె మరిది ట్విట్టర్ ద్వారా సహాయం కోసం అభ్యర్థించగా కొందరు స్పందించారు. వచ్చిన మొత్తం ఆపరేషన్కు సరిపోదు. మరోవైపు జ్యోతిబాయి పరిస్థితి క్రిటికల్గా మారడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత.. ఆపరేషన్ ఖర్చును భరిస్తానని ముందుకొచ్చారు. కవిత చొరవతో జ్యోతిబాయికి క్లిష్టమైన ఆపరేషన్ సోమవారం పూర్తయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. దీనిపై కవిత ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వెలిబుచ్చారు. కవితక్క చేసిన సహాయానికి జ్యోతిబాయితోపాటు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ అయిన తాను ఇక నుంచి గర్భిణులను ఉచితంగా హాస్పిటల్కు తరలిస్తానని జ్యోతిబాయి భర్త తెలిపారు.