పంట దిగుబడిలో జిల్లా ఎలా ఫస్ట్ నిలిచింది
ఆసక్తిగా అడిగి తెలుసుకున్న సీజేఐ ఎన్వీ రమణ
హైదరాబాద్/ ప్రత్యేక ప్రతినిధి, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో పంటలు ఎలా పండుతున్నాయి? వరి దిగుబడిలో నల్లగొండ జిల్లా ప్రథమస్థానంలో ఎలా నిలిచింది’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం రాజ్భవన్లో సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణలో పంటలసాగు, అభివృద్ధిపై గుత్తాతో చర్చించారు.నాగార్జునసాగర్, ఏఎంఆర్, డిండి ప్రాజెక్టులు, కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు అందించడంతో రైతులు వరి బాగా పండించారని గుత్తా సుఖేందర్రెడ్డి వివరించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి నల్లగొండ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలన అద్భుతంగా ఉన్నదని, యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా నిర్మించారని జస్టిస్ ఎన్వీ రమణ అభినందించినట్టు సుఖేందర్రెడ్డి వెల్లడించారు.
విద్యుత్తు సరఫరా భేష్
‘విద్యుత్తు విషయంలో తెలంగాణ భేష్గా ఉన్నది. బాగా చేస్తున్నారు’ అంటూ స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కితాబివ్వడంతో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ఉబ్బితబ్బిబ్బయ్యారు. బుధవారం రాజ్భవన్లో జస్టిస్ ఎన్వీ రమణను ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, ప్రముఖ న్యాయవాది రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీజేఐ రమణ మాట్లాడుతూ.. విద్యుత్తు విషయంలో రాష్ట్రంలో పరిస్థితి చాలా బాగుందని అభినందించారు. భేష్ అంటూ మెచ్చుకున్నారు.