హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియామకం అయ్యారు. అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావుకు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు హైదరాబాద్కు చెందిన వ్యక్తి. 1966, ఆగస్టు 7న హైదరాబాద్లో జన్మించారు. నగరంలోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో పదో తరగతి వరకు చదివారు. ఇంటర్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో, బీఎస్సీ భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో పూర్తి చేశారు. 1989లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్నారు. ఎల్ఎల్బీ తృతీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించినందుకు సీవీఎస్ఎస్ ఆచార్యులు గోల్డ్ మెడల్ను రామచంద్రరావు అందుకున్నారు. 1989, సెప్టెంబర్ నెలలో అడ్వకేట్గా తన పేరును నమోదు చేసుకున్నారు. 1991లో యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా సాధించారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో హైకోర్టు జడ్జిలు శుక్రవారం ఆమెకు వీడ్కోలు పలికారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ హైకోర్టు మొట్టమొదటి మహిళా చీఫ్ జస్టిస్గా హిమా కోహ్లీ ఈ ఏడాది జనవరి 7న నియమితులైనారు. సెప్టెంబర్ 1న పదవీ విరమణ చేయనున్న సందర్భంలోనే ఆమెకు సుప్రీం జడ్జిగా పదోన్నతి లభించడం విశేషం. దీంతో మరో మూడేళ్ల పాటు హిమా కోహ్లీ జడ్జిగా పనిచేసే అవకాశం లభించింది.