హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనంతగిరి రిజర్వాయర్ ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీలో మౌలిక వసతులు కల్పించినప్పటికీ నిర్వాసితులు సంతృప్తి చెందడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ విషయమై పిటిషనర్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. అక్కడ 500 మీటర్ల రోడ్డు పనులు మినహా మిగిలిన డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లాంటి వసతులన్నీ ఏర్పాటయ్యాయని, ఇందుకు రూ.70 కోట్లు ఖర్చయ్యాయని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ వివరించారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడ్వకేట్ కమిషన్ లేదా స్థానిక మెజిస్ట్రేట్తో విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ అభ్యర్థనను ఆమోదించిన హైకోర్టు.. సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జితో క్షేత్ర స్థాయి విచారణకు ఆదేశించింది. పునరావాస కాలనీలో ఎలాంటి వసతులున్నాయో స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ సివిల్ జడ్జి పరిశీలనకు వెళ్లే ముందే ఆ విషయమై సిరిసిల్ల అదనపు కలెక్టర్, భూసేకరణ అధికారి (ఆర్డీవో)తోపాటు పిటిషనర్ల తరఫు న్యాయవాది సీహెచ్ రవికుమార్కు సమాచారం ఇవ్వాలని సూచించింది. పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన జరిగితే పిటిషనర్లు ఉంటున్న రెండు పడక గదుల ఇండ్లను ప్రభుత్వానికి అప్పగించాలని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వం చెప్తున్నట్లుగా పునరావాస కాలనీలో మౌలిక వసతులుంటే అకడి ప్లాట్లను పిటిషనర్లకు అప్పగించాలని రెవెన్యూ శాఖను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఆగస్టు 23కు వాయిదా వేసింది.