బొడ్రాయిబజార్, ఆగస్టు 19: కేంద్రంలోని బీజేపీ ఒకవైపు దేశసంపదను లూటీచేస్తూ మరోవైపు ప్రజలను ఆశీర్వదించాలంటూ యాత్రలు చేయడమేమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. గురువారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెట్టుబడిదారుల కోసమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో వేస్తానన్న రూ.15 లక్షలు ఇవ్వకుండా, కోటి ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రజలకు ఏం చేశారని యాత్రలు చేస్తున్నారని నిలదీశారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్మివేస్తూ లూటీ చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసీ, ఇన్సూరెన్స్, పౌర విమానయానాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమైన చర్య అని చెప్పారు. పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచు తూ పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. ఆశీర్వదించమంటూ వస్తున్న బీజేపీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.