హైదరాబాద్ : యాదాద్రిలో జర్నలిస్ట్లకు ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. యాదాద్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు ఇండ్ల స్థలాలు అడిగినట్లు మోత్కుపల్లి నర్సింహులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ మేరకు ఇండ్ల స్థలాల విషయంలో కేటాయించే బాధ్యతను అప్పగిస్తూ మంత్రికి ఆదేశాలిచ్చారు. మంత్రి, కలెక్టర్, వైటీడీఏ అధికారులు చర్చించి.. ఎలా కేటాయించాలో చర్యలు తీసుకుంటారన్నారు. ‘యాదాద్రి జర్నలిస్ట్ కాలనీ’ అంటేనే గొప్పగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుందామన్నారు. క్షేత్రమెంత గొప్పగా బాగుంటుందో.. కాలనీ కూడా అంత గొప్పగా ఉండాలని.. దాంతో మనకు కారణంగా నిలుస్తుందన్నారు. జర్నలిస్టులు వార్తల వాహకులని.. ఆలయ నిర్మాణానికి సంబంధించి, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రం, ఆధ్యాత్మిక సంపదను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు క్షేత్రానికి సంబంధించిన ప్రత్యేక పరిశోధన వ్యాసాలు, కథనాలు రాయాలని మీడియా ప్రతినిధులను కోరారు.
యాదాద్రిపై ఉచిత బస్సులు : సీఎం కేసీఆర్
యాదాద్రి కొండపైకి వచ్చే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లుస సీఎం కేసీఆర్ తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణతో పాటు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొండపై బస్సు, కారు పార్కింగ్ నిర్మాణం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రిలో మరిన్ని కట్టడాలు కూడా వస్తాయని వెల్లడించారు. యాదాద్రిలో రెండు రకాల డ్రైనేజీ వ్యవస్థ ఉండాలని, వర్షాకాలంలో వరద నీరు వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థ రావాలన్నారు.