హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్కు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం లో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, తెలంగాణ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో దళిత, గిరిజనులకు చేసిందేమీలేదని చెప్పారు. ఆదివాసీ, గిరిజన సంస్కృతికి, నాగోబా జాతరలకు నిధులిచ్చి పరిరక్షించటంతోపాటు, జోడేఘాట్లో గోండు వీరుడు కుమ్రంభీం మ్యూజియం పెట్టి, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. పోడు భూముల సమస్యను మానవీయకోణంలో పరిష్కరిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే ఇంద్రవెల్లి సభ జరిగిందని ఆరోపించారు.
ఆదివాసీలను పిట్టల్లా కాల్చిన చరిత్ర కాంగ్రెస్ది : ఎమ్మెల్సీ పురాణం
ఇంద్రవెల్లిసభతో రేవంత్ నీచ సంస్కృతి బట్టబయలయిందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ మండిపడ్డారు. ఆదివాసీ బిడ్డలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చిన చరిత్ర కాంగ్రెస్దని విమర్శించారు. ఇంద్రవెల్లి మారణకాండ జరుగుతున్నప్పుడు రేవంత్రెడ్డి పెయింటింగ్ వేసుకుంటూ బతుకుతున్నాడని చెప్పా రు. ఇంద్రవెల్లి అమరులకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. సమైక్యరాష్ట్రంలో జోడేఘాట్కు వెళ్లనీయని దుర్మార్గమైన కాంగ్రెస్ పాలనను ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. ఇంద్రవెల్లి సభకు లక్షమంది రాకపోతే తలనరుక్కుంటానని రేవంత్ బీరాలు పలికారని.. రాలేదని నిరూపిస్తే తల నరుక్కుంటావా? అని సవాల్ విసిరారు. దళితబంధు పథకాన్ని జీర్ణించుకోలేకే అవాకులు చెవాకులు పేలుతున్నారని చెప్పారు. రేవంత్ జైలుకెళ్లే రోజులు దగ్గరపడుతున్నాయని హెచ్చరించారు.