మియాపూర్, సెప్టెంబర్ 22: కేవలం మూడు నెలల వ్యవధిలో.. ఏడు ఐటీ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు..! అదీ ఉద్యోగావకాశాలు సన్నగిల్లిన కరోనా సంక్షోభ కాలంలో..!! ఇది ఒక సామాన్య వ్యవసాయ కుటుంబానికి చెందిన కొల్లు బిందుప్రియ సాధించిన ఘనత. హైదరాబాద్లోని హైదర్నగర్లో ఉన్న రిషి ఎమ్మెస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ కోర్సు పూర్తి చేసిన ఈ విద్యార్థినికి టీసీఎస్, హర్మాన్కార్డన్, టాటాగ్రూప్స్, సొసైటీ జనరల్, స్కిల్డ్రైవ్, సింటెల్, ఎల్వీ సొల్యూషన్స్ వంటి ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగ ఆఫర్లు ఇచ్చాయి. ఇందులో నాలుగు ఆఫర్లు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా లభించాయి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బిందుప్రియ.. చందానగర్లోని బంధువుల ఇంట్లో ఉంటూ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. తల్లిదండ్రులు కొల్లు వెంకటరమణ, నాగమణి వ్యవసాయానికి తోడు పశువులను తోలుకుంటూ బిడ్డను చదివించారు. తమ బిడ్డకు ఏకంగా ఏడు కంపెనీల నుంచి ఆఫర్లు రావడంతో తమ కష్టం ఫలించిందంటూ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇన్ని ఆఫర్లు రావడం గర్వంగా ఉన్నదని, కళాశాల అధ్యాపకుల తోడ్పాటు, గైడెన్స్తో విజయం సాధించినట్టు బిందుప్రియ పేర్కొన్నారు. కేవలం మూడు నెలల్లోనే ఏడు ఆఫర్లు లభించిన నేపథ్యంలో బిందుప్రియను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఉత్తమ భవిష్యత్తు, ఉత్తమ ప్యాకేజీ అంశాలపై కళాశాల కరస్పాండెంట్ రాజశ్రీ, ప్రిన్సిపల్ వెంకట శేషయ్యనాయుడు, ప్లేస్మెంట్ అధికారిణి లక్ష్మీతులసి సూచనల మేరకు ఫ్రాన్స్ దేశానికి చెందిన సొసైటీ జనరల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా బిందుప్రియ చేరింది.