తిరుపతి: శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల ఇకపై హనుమంతుని జన్మస్థానంగా కూడా గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవత్సరాది ఉగాది నాడు ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సిద్ధమైంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి గురువారం ఈ విషయంపై కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కమిటీలోని పండితులు జ్యోతిష శాస్త్రం, శాసనాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాలతో ఉగాది నాడు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. హనుమంతుని జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇతర వివరాలతో త్వరలో సమగ్రమైన పుస్తకాన్ని తీసుకొస్తామన్నారు.
అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో నిరూపించేందుకు 2020 డిసెంబరులో టీటీడీ పండితులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలోని పండితులు పలుమార్లు సమావేశాలు నిర్వహించి లోతుగా పరిశోధన చేసి హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించారు. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్యం గ్రంథం, వరాహమిహిరుని బృహత్సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంకటేశ్వరస్వామివారి చెంత గల అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం ప్రకారం, తేదీ ప్రకారం నిర్ధారించారు.