హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో బోగస్ అధ్యాపకులను నివారించేందుకు యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకున్నది. తమవద్ద పనిచేస్తున్న అధ్యాపకులు అర్హులేనని అఫిడవిట్లు సమర్పించాలని కాలేజీలను ఆదేశించింది. స్టాఫ్ సెలెక్షన్ కమిటీ మినిట్స్లో భాగంగా తాము సమర్పించిన వివరాలన్నీ సక్రమేనని ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన ఫార్మాట్ను జతపరిచి కాలేజీల యాజమాన్యాలకు నోటీసులు జారీచేసింది. 2021-22 విద్యాసంవత్సరానికి ఇటీవలే ఫ్యాకల్టీ సెలెక్షన్స్కు జేఎన్టీయూ అధికారులు అవకాశం కల్పించారు. ఏఐసీటీఈ/ పీసీఐ మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు ఫ్యాకల్టీని నియమించుకోవాల్సి ఉండగా, ఇటీవలే ఆ ప్రక్రియను పూర్తిచేశాయి. ఈ నియామకాలకు స్టాఫ్ సెలెక్షన్ కమిటీ మినిట్స్ (ఎస్ఈఎం) ఆమోదం తెలిపాల్సి ఉన్నది. ఈ నెల ఏడోతేదీ వరకు కాలేజీల వారీగా ఎస్ఈఎం సమావేశాలు నిర్వహిస్తూ ఆమోదముద్ర వేస్తున్నారు. ఈ సమావేశాలకు ముందే కాలేజీలు అఫిడవిట్లు సమర్పించాలని జేఎన్టీయూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనను కొత్త ఫ్యాకల్టీకే పరిమితం చేయకుండా, పాతవారికి కూడా వర్తింపజేయాలని టెక్నికల్ అండ్ ఫ్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ బాలకృష్ణారెడ్డి కోరారు.