హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): అది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం. అందులో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, విద్యను భోదిస్తున్న ఫ్రొపెసర్లు, పనిచేస్తున్న సిబ్బంది అంతా వర్సిటీ కీర్తిని చూసి ఘనంగా మురిసిపోతుంటారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయమే జేఎన్టీయుహెచ్. దేశానికి అవసరమయ్యే ఇంజినీర్లు, వృత్తివిద్యానిపుణులను తయారుచేస్తున్న జవహాల్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) స్వర్ణోత్సవ సంబురాలకు సిద్ధమవుతున్నది.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి స్వర్ణోత్సవ సంబురాలు జరపనున్నారు. ఈ యూనివర్సిటీని 1972 అక్టోబర్ 2న ఏపీ శాసన చట్టం ద్వారా ఏర్పాటు కాగా, దేశంలో తొలి సాంకేతిక విశ్వవిద్యాలయంగా ఏర్పాటైన యూనివర్సిటీ జేఎన్టీయూయే కావడం గమనార్హం. ఈ యూనివర్సిటీ ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీతో 50వ వసంతంలోకి అడుగుపెట్టనున్నది. ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు, సదస్సులు, ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నాలుగు వర్సిటీలుగా..
1972లో యూనివర్సిటీగా ఏర్పాటైన తర్వాత కాలకమ్రేణా వస్తున్న మార్పుల మేరకు 2008లో జేఎన్టీయూను నాలుగు యూనివర్సిటీలుగా పునర్వ్యవస్థీకరించారు. ఈ ఒక్క యూనివర్సిటీ నుంచే జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలు (జేఎన్ఏఎఫ్ఏయూ)లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్లోని కూకట్పల్లిలో జేఎన్టీయూ ప్రధాన క్యాంపస్ ఆధారంగా యూనివర్సిటీని నడుపుతున్నారు. 89 ఎకరాల విస్తీర్ణం గల ఈ క్యాంపస్లో స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లున్నాయి. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా కొండగట్టు (జగిత్యాల), మంథని (పెద్దపల్లి), సుల్తాన్పూర్ (మెదక్)లలో యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలుండగా, ఈ విద్యాసంవత్సరమే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు.
ఏడాది పొడవునా కార్యక్రమాలు
గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించనున్నాం. ప్రస్తుతానికి లోగో డిజైన్. స్లోగన్ రైటప్ పోటీలను నిర్వహిస్తున్నాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం, విద్యార్థులకు గోల్డ్జూబ్లీ గోల్డ్మెడల్స్ను అందజేయాలనుకుంటున్నాం. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో అక్టోబర్ 3న ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం.
వైవిధ్య కోర్సులు..
సంప్రదాయ కోర్సులతోపాటు ప్రస్తుత డిమాండ్ను బట్టి ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ సహా పలు కోర్సులను యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. బీటెక్లో 24, ఎంటెక్లో 64, ఎం ఫార్మసీలో 11 కోర్సులతో పాటు, ఎంసీఏ, ఎంబీఏ, ఎంఏఎం, ఎంటీఎం, ఫార్మా -డీ కోర్సులను నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ పరిధిలో మొత్తంగా 200పైచిలుకు అనుబంధం కాలేజీలున్నాయి. ప్రతీ ఏటా 3.50 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు.
ర్యాంకింగ్స్..