హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా, జేఎన్టీయూ యూనివర్సిటీ కళాశాలల్లో ఇంజినీరింగ్ ఫీజులను ఈ ఏడాది పెంచారు. ఈ కాలేజీల్లో రూ.35 వేలను కనీస ఫీజుగా ఖరారుచేశారు. ఇది వరకు రూ.18 వేలుగా ఉన్న ఫీజును రూ.35 వేలుగా నిర్ణయించారు. ముఖ్యంగా సెల్ఫ్పైనాన్స్ కోర్సుల ఫీజును రూ.35 వేల నుంచి రూ.70 వేలకు పెంచారు. ఓయూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఫీజును రూ.1.20 లక్షలకు పెంచారు. అయినా, విద్యార్థులపై ఫీజు భారం మోపకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పెంచిన ఫీజును రీయింబర్స్మెంట్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో డబ్బులు రాబట్టడం, ఆయా ఫీజులను కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు వాడేందుకు ప్రాధాన్యం ఇచ్చింది.
పెంచిన ఫీజులు నామమాత్రమేనని, ప్రైవేట్తో పోలిస్తే తక్కువేనని, ఇవి విద్యార్థులకు భారంకావని అధికారులు అంటున్నారు. విద్యార్థుల కంటే ప్రభుత్వంపైనే అధిక భారపడుతుందని పేర్కొంటున్నారు. ఇంజినీరింగ్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింజేస్తున్న విషయం తెలిసిందే. 10 వేలలోపు ర్యాంకు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఈడబ్ల్యూఎస్ కోటా వారు ఏ కాలేజీలో చేరినా పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇక 10 వేలపైన ర్యాంకు ఉన్నవారికి ఫీజు రీయింబర్స్మెంట్గా రూ.35 వేలు ఇస్తుండగా, విద్యార్థి చేరిన కాలేజీ ఫీజు అధికంగా ఉంటే ఆయా ఫీజును విద్యార్థియే భరించాల్సి ఉన్నది. ఈ లెక్కన ఓయూ, జేఎన్టీయూలో ఫీజు రూ.35 వేలుగా పెంచారు. దీంతో ఆయా విద్యార్థులంతా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లబ్ధిపొందుతారని, ఇదేమంత భారంకాదని అధికారులు అంటున్నారు. పెంచిన ఫీజులు ప్రైవేట్ కాలేజీలతో పొల్చితే తక్కువేనని ఉదహరిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ ప్రైవేట్ కాలేజీలో ఏడాదికి రూ.1.34 లక్షల ఫీజు తీసుకుంటున్నారు. విద్యాప్రమాణాలుసహా ప్లేస్మెంట్స్లో మొదటిస్థానంలో ఉన్న ఓయూ, జేఎన్టీయూ కాలేజీల్లో చేరే వారంతా ప్రతిభావంతులే కావడంతో వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని అంటున్నారు.
ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల పెంపు ఈ ఏడాది ఉండే అవకాశంలేదని అధికారులు అంటున్నారు. ఇంజినీరింగ్లో కామన్ ఫీజు కాకుండా కాలేజీలను బట్టి వేర్వేరుగా ఫీజులను నిర్ధారించారు. ఇందుకోసం తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఉంది. మొదటిసారిగా 2016లో ఒకసారి ఫీజులను పెంచగా, 2019లో మరోసారి ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులను పెంచారు. సాధారణంగా ప్రతీ మూడేండ్ల కొకసారి ఫీజులను పెంచుకునే అవకాశముండగా.. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల పెంపు ప్రతిపాదన వచ్చే ఏడాది పరిశీలనకు రానున్నది.