బంజారాహిల్స్, మే 8: ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా గత ఏడాది నుంచి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. బస్తీల్లో పెరుగుతున్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రహ్మత్నగర్ డివిజన్ కార్పొరేటర్ సీఎన్.రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన డిస్ ఇన్ఫెక్టింగ్ వాహనాన్ని శనివారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత యేడాది లాక్డౌన్ సమయంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను, ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఆహారాన్ని అన్ని డివిజన్లలో తాము అందించామన్నారు. రహ్మత్నగర్ డివిజన్ కార్పొరేటర్ సీఎన్.రెడ్డి ఆధ్వర్యంలో గత ఏడాది ప్రారంభించిన డిస్ ఇన్ఫెక్షన్ వాహనాలను అన్ని డివిజన్లలో నడిపించామని, కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్నందున మరోసారి ఈ వాహనాల ద్వారా అన్ని బస్తీల్లో ముమ్మరంగా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తామన్నారు.