హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత మధుయాష్కీ రాష్ర్టానికి ఓ టూరిస్ట్ అని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా తెలియడం లేదని టీఆర్ఎస్ఎల్పీ దుయ్యబట్టింది. అభివృద్ధిని తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు అడ్డంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. నిజామాబాద్ ఎంపీగా పదేండ్లు ఉన్నా ఏమీచేయలేని దద్దమ్మ మధుయాష్కీ అని మండిపడింది. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, పురాణం సతీశ్, గంగాధర్గౌడ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో పదేండ్లలో ప్రభుత్వానికి ఇసుక మీద కేవలం రూ.36 కోట్లు ఆదాయం వస్తే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ తెచ్చిన ఇసుక పాలసీతో ఏడేండ్లలోనే రూ.4,335 కోట్ల ఆదాయం వచ్చిందని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి తెలిపారు. అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఇష్టారీతిగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఆయనకు సబ్జెక్ట్ తక్కువ.. సౌండ్ ఎక్కువ అని ఎద్దేవాచేశారు. లాబీయింగ్ స్పెషలిస్ట్ మధుయాష్కీ ఎమ్మెల్సీ కవితపై ఆడబిడ్డ అనే సోయిలేకుండా వ్యాఖ్యలు చేయడంతో మహిళల పట్ల ఆయన నిజస్వరూపమేమిటో తెలియజేస్తున్నదని చెప్పారు. ఎన్నికల నుంచి పారిపోయి, బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తి మధుయాష్కీ అని ఎమ్మెల్సీ వీ గంగాధర్గౌడ్ విమర్శించారు.రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా దళితబంధు ఆగదు
‘కంచు మోగునట్టు కనకమ్ము మోగునా’ అన్నట్టు కాంగ్రెస్ నేతలు మొరుగుతున్నారని.. సీఎం కేసీఆర్ మాత్రం రాష్ర్టాన్ని కనకమయం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తెలిపారు. మధుయాష్కీ, బీజేపీ నేత బండి సంజయ్ వారిస్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభ్యతలేని నాయకులను ప్రజలు ఎక్కడిక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కమీషన్ల కోసం బీ-ఫాంలు అమ్ముకున్న మధుయాష్కీ నీతి, నిజాయితీ గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కోర్టుల్లో ఎన్నికేసులు వేసినా సీఎం కేసీఆర్ ప్రాజెక్టును పూర్తిచేశారని.. రేపు దళితబంధును ఆపాలని చూసినా తలపెట్టిన కార్యాన్ని పూర్తిచేసి తీరుతారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టంచేశారు. దళితబంధుపై, దళితులపై ఈటల బావమరిది చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని పేర్కొన్నారు.