బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని మట్టికరిపించిన గులాబీ
సీఎం కేసీఆర్ రాజకీయ చతురతకు కంగుతిన్న కమలం
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు పట్టంకట్టిన పట్టభద్రులు
వాణీదేవి గెలుపులో సమష్టిగా రాణించిన గులాబీ సైన్యం
ప్రగతి వైపే నిలిచిన గ్రాడ్యుయేట్లు
సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ ) : పులి ఒకటి అడుగు వెనకంజ వేసిందంటే …దాని సంకేతం ఓటమి అని కాదు…మరో రెండు అడుగులు ముందుకు దూకి శత్రువుపై దాని ఉగ్రరూపం చూపించడానికే…ఇదీ టీఆర్ఎస్ పార్టీ విషయంలో అక్షరాల నిరూపితమైనది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రాబల్యం తగ్గిపోయిందని ప్రతిపక్షాలు చేసిన విష ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టేందుకు పెద్దగా సమయం తీసుకోలేదు. ఉద్యోగాల కల్పనలో ప్రజాక్షేత్రంలో సాక్ష్యాధారాలను ప్రజలు ముందు ఉంచడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా అబద్ధాలను అందంగా చెబుతూ.. పబ్బం గడిపే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పింది. ఆనతికాలంలోనే వచ్చిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటాపై సగర్వంగా గులాబీ జెండాను ఎగురవేసింది. అంతేకాదు బీజేపీ సిట్టింగ్ కోటాపై పాగా వేసి తమ సత్తా ఏమిటో మరోసారి చాటిచెప్పింది.
ఎన్రోల్ నుంచి గెలుపు వరకు…
వాణీదేవి విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి క్యాడర్ వరకు సమష్టిగా పనిచేశారు. ముందుగా ఓటరుగా ఎన్రోల్ నుంచి ఓటర్లను పోలింగ్ బూత్ వరకు గ్రేటర్ ప్రజాప్రతినిధులు, ఇన్చార్జిలు, శ్రేణులు, పార్టీ అభిమానులు విశేషంగా కృషి చేశారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రులు కేటీఆర్, జిల్లా ఇన్చార్జీలుగా మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ నిత్యం ప్రచార సరళిని తెలుసుకుంటూ.. ఓటర్లకు చేరువయ్యారు. ప్రతి 50 ఓటర్లకు ఇన్చార్జీలతో పాటు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ల ద్వారా శ్రేణులను దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరు గడపను తట్టి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ వారిని పార్టీ వైపు ఆకర్షించారు .విస్తృతంగా ప్రచారం నిర్వహించి ..రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం పెంపు వరకు ఐక్యతను చాటి తెలంగాణ ఆత్మను ఆవిష్కరించారు. అన్ని వర్గాలను ఏకం చేశారు. పార్టీ ఏకంగా రెండు లక్షల 80వేలకు పైగా ఎన్రోల్ చేయగా, వారిని పోలింగ్ కేంద్రానికి తరలించడంలో సక్సెస్ అయ్యారు. ఒక ఓటరును దాదాపు ఐదు సార్లు కలవడమే కాకుండా పోలింగ్ వరకు తీసుకువెళ్లి ఓటింగ్ శాతం పెంచడంలో కీలకంగావ్యవహరించారు.
అనూహ్యంగా తెరపైకి…
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ పోటీలో ఉండదు..జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ ప్రాబల్యం తగ్గిపోయింది..ఇక ఆ పార్టీని ప్రజలు విశ్వసించరు..ఇలా అనేక అసత్యాలు, నోటికి ఎంత వస్తే అంత ప్రతిపక్షాలు విష ప్రచారం చేశాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు ఊహించని విధంగా వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన సీఎం కేసీఆర్.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పీవీ కూతురు, విద్యావేత్త వాణీదేవిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. తెలంగాణకు ఠీవీ అయిన పీవీని జాతీయ పార్టీలు గుర్తించకపోయినా.. శత జయంతి ఉత్సవాలను నిర్వహించడమే కాకుండా ఆ కుటుంబం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వాణీదేవిని తీసుకువచ్చారు. ఇక్కడే సీఎం కేసీఆర్ తన వ్యూహంతో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చారు.