బంజారాహిల్స్, ఏప్రిల్ 21: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన రాత్రిపూట కర్ఫ్యూను దిక్కరించేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూను విధించారు. మంగళవారం తొలిరోజు కావడంతో కర్ఫ్యూపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్లపై అకారణంగా వచ్చేవారికి కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు.. మరోసారి నిబంధనలు ఉల్లంఘించవద్దని హెచ్చరించి పంపించారు. రాత్రి 8గంటలకు అన్ని వ్యాపార సంస్థలను మూసేయాల్సి ఉంటుందన్నారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది 9 గంటలలోపు ఇండ్లకు చేరుకునేందుకు వీలుగా ఈ నిబంధనలు విధించారని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో పగటిపూట మాస్కులు లేని వారికి జరిమానాలు విధిస్తున్న పోలీసులు.. రాత్రిపూట కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.