బుట్టబొమ్మ పూజాహెగ్డే పట్టిందల్లా బంగారమవుతోంది. వరుస విజయాలు పలకరించడంతో ఈ అమ్మడి కెరీర్ పతాకస్థాయిలో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ. ప్రస్తుతం తాను సినీ ప్రయాణాన్ని మనసారా ఆస్వాదిస్తున్నానని.. అయితే హిందీలో తొలిచిత్ర పరాజయం తన కెరీర్ను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పింది పూజాహెగ్డే. హృతిక్రోషన్ సరసన ‘మొహంజదారో’ చిత్రంతో ఆమె హిందీ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ అనుభవాల గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ ‘ప్రతిఒక్క నాయిక కెరీర్లో తొలి అడుగు చాలా ముఖ్యం. ‘మొహంజదారో’ జాతీయస్థాయిలో ఆసక్తినిరేకెత్తించింది. ఆ సినిమాతో కెరీర్కు ఢోకా లేదనుకున్నా. అయితే అంచనాలన్నీ తలక్రిందులు కావడంతో చాలా నిరుత్సాహపడ్డాను. తొలి చిత్రం ఫెయిల్ అయితే మరలా అవకాశం సంపాదించుకోవడం అంత సులభం కాదు. కొద్ది మాసాలపాటు నా కెరీర్పై సందేహాలు కమ్ముకున్నాయి. ఆ రోజులు తలచుకుంటే భయంగా అనిపిస్తుంది. ఫెయిల్యూర్ను మరచిపోయి అవకాశాల మీద దృష్టిపెట్టా. ప్రతి సినిమా కోసం అంకితభావంతో పనిచేశా. ఇప్పుడు నేను కోరుకున్న స్థానానికి చేరుకున్నాననే సంతృప్తి ఉంది. తొలి పరాజయాలతో ఎవరూ నిరుత్సాహపడొద్దు. పరిశ్రమలో జయాపజయాలు ఒక్కరి చేతిలో ఉండవన్న సత్యాన్ని తెలుసుకొని ధైర్యంగా ముందడుగువేయాలి’ అని సూచించింది పూజాహెగ్డే. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తోంది.