జపాన్ యంత్రాలు పరిశీలించిన మంత్రి గంగుల
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా మిల్లిం గ్ సామర్థ్యం పెంచేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా గంటకు 50 టన్నుల చొప్పున రోజుకు 1,200 టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసే సామర్థ్యం గల జపాన్ టెక్నాలజీతో నడిచే సటాకీ యంత్రాలను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. కర్ణాటక రాయ్చూర్లోని సటాకీ కంపెనీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి యంత్రాలను పరిశీలించారు. మిల్లింగ్ చేయగా వచ్చే ఊక నుంచి మిషనరీకి అవసరమయ్యే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చని సంస్థ సౌత్ ఇండియా ఏజీఎం సతీశ్ తెలిపారు. ఈ విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట సటాకీ సౌత్ ఇండియా డీలర్ విఠల్, తెలంగాణ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్, ఆగ్రోటెక్ ప్రతినిధి నర్సింహ ఉన్నారు.