వికారాబాద్ జిల్లా ధారూరు మండలం శేరిగడ్డతండాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు సంతోష్, రమేశ్లకు క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి. దీంతో చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేవారు. సంతోష్ మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ వరకు చదువుకుని మానేశాడు. క్రికెట్లో రాణించాలనే ఉద్దేశంతో హైదరాబాద్, పంజాబ్ రాష్ట్రంలో శిక్షణను తీసుకున్నారు. వికారాబాద్లోనే ఓ క్రికెట్ అకాడమీ శిక్షణ కేంద్రాన్ని 2020 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ కేంద్రంలో 70 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. అండర్ 19లో 24 మంది, అండర్-14కు 23 మంది, సీనియర్స్, పిల్లలతో కలిపి 70 మందివరకు శిక్షణ పొందుతున్నారు. ఈ అకాడమీ నిర్వాహకులు వికారాబాద్ పట్టణంలోని ఖాళీ స్థలాల్లో విద్యార్థులకు శిక్షణను ఇస్తున్నారు. ఈ శిక్షణలో బాలబాలికలు ఉన్నారు. ఇప్పటివరకు ముగ్గురు విద్యార్థులు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో ఎంపికై ఆడుతున్నారు. మరొక విద్యార్థి నేషనల్ క్లబ్కు ఎంపికకావడంతో త్వరలో ఢిల్లీలో ఆడనున్నారు. మరో క్రీడాకారుడు శ్రీనివాస్ మహారాష్ట్ర తరఫున ఎంపికయ్యాడని, ప్రస్తుతం హైదరాబాద్లో ఫిట్నెస్ శిక్షణ తీసుకుంటున్నారు. విద్యార్థులు క్రీడా రంగంలో బ్యాట్స్మెన్, బౌలింగ్, ఆల్రౌండర్గా ఎదుగుతూ దూసుకుపోతున్నారు.
విదేశాలకు ఎంపికైన ముగ్గురు విద్యార్థులు
అకాడమీలో వికారాబాద్ జిల్లా ధారూరు ప్రాంతానికి చెందిన ముగ్గురు విద్యార్థులు రోషన్(రిక్షాకాలనీ), రఘునందన్ (అల్లీపూర్), శిక్షణ పొంది ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో నిర్వహించే పోటీలకు ఎంపికై ఆడుతున్నారు. నిషాంత్ అనే విద్యార్థి నేషనల్ క్లబ్కు ఎంపికయ్యాడు. త్వరలో ఢిల్లీలో ఆడనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో ఫిట్నెస్ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ అకాడమీకి చెందిన మరో ఐదుగురు విద్యార్థులు హైదరాబాద్ క్లబ్నుంచి ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్, బోపాల్లో జరిగే ప్రీమియర్ లీగ్ ట్రోపీల్లో ఆడనున్నారు. ఈ లీగ్లో కేవలం 6 టీం లు మాత్రమే పోటీలో పాల్గొంటాయి.
గ్రేస్బాల్తో శిక్షణ..
క్రీడాకారులకు వారంలో రెండు రోజులు హైదరాబాద్లో గ్రేస్ బాల్తో శిక్షణ ఇస్తున్నారు. ఒక టీం కోసం సుమారు రూ.8వేలు ఖర్చు అవుతుందని నిర్వాహకులు తెలిపారు. వారంలో రెండు సార్లు రెండు జట్లకు గానూ రూ.16వేల వరకు ఖర్చు వస్తుందని పేర్కొంటున్నారు.
క్రీడాకారులకు దాతల సహాయం
శిక్షణను ఇచ్చేందుకు ఎక్కడ అనువైన స్థలం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి కోర్టు ఎదుట తన ప్లాట్ స్థలాన్ని కోచింగ్ కోసం ఇచ్చారు. అదే విధంగా పట్టణంలోని బాలాజీ దవాఖాన వైద్యుడు సందీప్ క్రీడాకారులకు షూ ఇచ్చారు. వికారాబాద్ సీఐ రాజశేఖర్ రోషన్ అనే విద్యార్థికి రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆటపై ఉన్న ఆసక్తితో వికారాబాద్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు పలు అకాడమిలో శిక్షణ పొంది విదేశాల్లో ప్రతిభను కనబరుస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, దాతల సహకారంతో క్రికెట్లో రాణిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పట్టుదల, లక్ష్యంతో క్రీడల్లో రాణించాలంటున్నారు విద్యార్థులు.
చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఆసక్తి
చిన్న తనం నుంచి క్రికెట్ అంటే చాలా ఆసక్తి. హైదరాబాద్, పంజాబ్లో శిక్షణ తీసుకున్నా. నేను నేర్చుకున్న ఆటను పదిమందికి నేర్పాలి అనే తపనతో ఎస్ఎస్ అకాడమీని స్థాపించాను. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విదేశాలతో పాటు మహారాష్ట్ర, ఢీల్లీ, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతంలో నా వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు ఆడుతున్నారు.
ఉన్నతస్థాయిలో ఉండాలనేది తపన
తాను నేర్చుకున్న క్రీడను పదిమందికి పంచాలనే ఉద్దేశంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తున్నాం. చాలా మందికి స్పీడ్, స్పిన్, మీడియం బౌలింగ్లో మెళకువలు నేర్పుతున్నాం. ఇప్పటికే మా అకాడమీలో శిక్షణ పొంది విదేశాల్లో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో రాణించి వికారాబాద్ ప్రాంతానికి మంచి గుర్తింపు తెస్తున్నారు.
ఇవీ కూడా చదవండి…
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..