జూన్ మొదటి వారం నుంచి ప్రారంభం
వ్యాక్సినేషన్లో కేంద్రం విఫలం
ప్రజలకు మెరుగైన సేవలు అందాలి
పదిరోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
జనగామ, దేవరుప్పులలో సూపర్ స్ప్రెడర్లకు టీకా ప్రారంభం
కలెక్టరేట్లో కొవిడ్ నియంత్రణ,ధాన్యం కొనుగోళ్లు, రెండో పంటపై సమీక్ష
జనగామ, మే 28 (నమస్తే తెలంగాణ)/ దేవరుప్పుల : విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందాలని, అన్ని ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీని పర్యవసానమే సెకండ్ వేవ్లో రోగులు, మరణాల సంఖ్య పెరుగుతుందన్నారు. జూన్ మొదటి వారం నుంచి తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు సీఎం కేసీఆర్ చొరవతో కార్యాచరణ సిద్ధమైందని చెప్పారు. శుక్రవారం ఆయన జనగామలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వారికి ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ రాజయ్య, కలెక్టర్ కే నిఖిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం జనగామ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్, జడ్పీ చైర్మన్ సంపత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జమున, అధికారులతో కలిసి జిల్లాలో కొవిడ్ నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లు, రెండో పంటకు సాగునీరు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
దేవరుప్పుల మండలంలోని ఉన్నత పాఠశాలలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొవిడ్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించినట్లు చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనునిత్యం ప్రజలతో ఉండే వ్యక్తులు లక్షా మూడువేల మంది ఉన్నారని, వారందరికీ శుక్ర, శనివారాల్లో వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. జనగామ జిల్లాలో 1,857 మంది ఉండగా, వారి కోసం మండలానికో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ కొరత లేదన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో ధరలు, పరీక్షలు, ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రజలు వైద్యం కోసం వరంగల్, హైదరాబాద్ వెళ్లకుండా అన్ని సౌకర్యాలు ఉన్న జిల్లా వైద్యశాలల్లోనే చికిత్స పొందేలా నమ్మకం కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరో పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే లక్షా 55వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. కష్టకాలంలో సహకరించని రైస్ మిల్లులను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.30వేల కోట్లు అప్పుగా తెచ్చి ధాన్యం కొంటున్నామని, కాస్త ఆలస్యమైనా రైతులు పండించిన ధాన్యం మొత్తం కొంటామని చెప్పారు. ఈసారి వర్షాలు ముందస్తుగా కురిసే అవకాశమున్నందున రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధం చేయాలని, రెండో పంటకు నీరిచ్చేందుకు అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు.
కాగా, దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కామారెడ్డిగూడెం వాస్తవ్యుడు మహ్మద్ గనీమియా కుటుంబ సభ్యులు, యాదాద్రి భువనగిరిలోని ప్రిన్స్మెడికల్ హాల్, పీఆర్ ఇంజినీర్ల సహకారంతో ఆక్సిమీటర్లు, థర్మల్స్కానర్లను మంత్రి ఎర్రబెల్లి మండలంలోని 32 గ్రామాల ఆశ వర్కర్లకు అందజేశారు. అనంతరం పీహెచ్సీకి స్త్రీ నిధి సంస్థ ఇచ్చిన నాలుగు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రారంభించారు. మండలంలో పలు గ్రామాలకు చెందిన 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, మరో 18 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంత్రి ఎర్రబెల్లి అందజేశారు. జనగామ సమీక్షలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, అబ్దుల్ హమీద్, ఏసీపీ వినోద్కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ యశస్వి, ఆర్డీవోలు మధుమోహన్, కృష్ణవేణి, డీఎంహెచ్వో డాక్టర్ మహేందర్, జిల్లా పౌరసరపరఫాల అధికారిణి రోజారాణి, డీఎంవో నాగేశ్వరశర్మ, డీఆర్డీవో రాంరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో కరుణశ్రీ, దేవరుప్పు మండల ప్రత్యేక అధికారి కొండల్రెడ్డి, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీవో ఉమామహేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్రెడ్డి, జడ్పీటీసీ భార్గవి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ నర్సింహారెడ్డి, లింగాలఘనపురం మాజీ ఎంపీపీ గణపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.