జనగామ: రాష్ట్రంలోని దేవరుప్పుల గ్రామంలో అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ సంస్థ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఉపాధి, ఉన్నత అవకాశాల కోసం ఉన్న ఊరును, కన్న తల్లిని వదలి వెళ్లిన డాక్టర్లు తమ రుణం తీర్చుకోవడానికి ఈ శిబిరం ఏర్పాటు చేశారని కొనియాడారు.
అమెరికాలో భారతీయ మూలాలు ఉన్న డాక్టర్లంతా కలిసి అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఏర్పడ్డారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అయిన సందర్భంగా, దేశంలోని 75 గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఈ బృందం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో జనగామ జిల్లాలోని దేవరుప్పుల, చిల్పూర్ మండలంలోని రాజవరం గ్రామాలు కూడా ఉన్నాయి. దేవరుప్పులలో ఈ స్కూల్లో చదివిన నాగేంద్ర ప్రసాద్ శాన్ ఫ్రాన్సిస్కో లో కాన్సూల్ జనరల్గా పని చేస్తున్నారు. ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు జరిపి, అమెరికా వైద్యులతో సంప్రదింపులు చేసి, రోగాలకు అవసరమైన మందులు సిఫారసు చేస్తారు. నేరుగా రోగుల ఫోన్లకే వాట్సాప్ ద్వారా మొత్తం సమాచారం పంపుతారు.
ఈ శిబిరంలో నిర్వహించే పరీక్షలు
తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఆ రోగాలు ఉన్నట్లే తెలియవు) ఎక్కువగా ఉన్నాయి. ఈ శిబిరాలు ప్రజలకు మంచి అవకాశం. ఈ శిబిరాన్ని నిర్వహించడాన్ని అభినందించిన మంత్రి ఎర్రబెల్లి.. ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్య సదుపాయాలు బాగా మెరుగుపడ్డాయని, ఆరోగ్యశ్రీ ద్వారా వెయ్యికి పైగా రోగాలకు ప్రభుత్వమే వైద్యం చేయిస్తున్నదని ఆయన చెప్పారు. ప్రతి జిల్లా హాస్పిటల్లో ఐసీయూలు, డయాలసిస్ కేంద్రాలు పెట్టామని, పాత దవాఖనలను బలోపేతం చేస్తూనే కొత్త హాస్పిటల్స్ పెట్టామని వెల్లడించారు.
విశ్వ నగరం హైదరాబాద్ నగరానికి నలుమూలలా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెడుతున్నామని, తెలంగాణలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దేశంలో వైద్య రంగంలో రాష్ట్రమే నెంబర్ వన్గా ఉన్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ హెల్త్ హబ్గా మారిందన్నారు. అనేక మందుల కంపెనీలు మన దగ్గరకే వస్తున్నాయని అన్నారు. ఒక్క ప్రభుత్వమే అన్నీ చేయడం సాధ్యం కాదని, ఇలా సంస్థలు, వ్యక్తులు కూడా సేవా దృక్పథంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సోషల్ బాధ్యతగా పెద్ద కంపెనీలు కూడా ఇలాంటి సేవలకు ముందుకు రావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.