హాలియా, ఏప్రిల్ 13 : ఎమ్మెల్యేగా ఏడుసార్లు, రాష్ట్రమంత్రిగా 17 ఏండ్లు పదవులు అనుభవించిన జానారెడ్డి నాగార్జునసాగర్కు చేసిందేమీలేదని.. నియోజకవర్గంలో ఆయన ఆటలు ఇక సాగవని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్తో కలిసి అనుముల మండలంలోని కొత్తపల్లిలో మంగళవారం మంత్రి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మీరు జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ మీకేమిచ్చిందని ప్రజలను అడిగారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త మంత్రి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతన్ని అక్కడి నుంచి పంపించాలని పోలీసులకు సూచించారు. జానారెడ్డి ఊరికి కొంతమందిని ఇలాంటి వాళ్లను తయారుచేశాడని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గుండాగిరిని పూర్తిగా అణిచివేశామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కరెంట్ కోతలు, చేనేత కార్మికుల ఆకలిచావులు, రైతన్నల ఆత్మహత్యలే ఉండేవని.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటిని పారదోలామని స్పష్టం చేశారు. దేశంలో వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు. 2014 నుంచి 18 వరకు ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డి.. ఒక్కరోజూ జడ్పీ సమావేశానికి రాలేదని, నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేలేదని గుర్తుచేశారు. ఆయన నిర్వాకం వల్లనే నెల్లికల్లు, కుంకుడుచెట్టుతండా ప్రజలు తాగు, సాగునీరు లేక గోస పడ్డారని ఆరోపించారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే నియోజకవర్గంలో అభివృద్ధి మొదలైందని, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కృషి ఫలితంగానే నెల్లికల్లు లిఫ్ట్, డీ 8, 9 డిస్ట్రిబ్యూటరీలకు లిఫ్ట్లు, హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరయ్యాయని చెప్పారు. ఆకలిచావులు, ఆత్మహత్యలు, కరెంట్ కోతలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కావాలో.. 24 గంటల కరెంట్, ఇంటింటికీ నల్లా నీళ్లు, ఆసరా పింఛ న్లు, పెట్టుబడి సాయం, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అందిస్తున్న టీఆర్ఎస్ కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల మండల ఇన్చార్జి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ పేర్ల సుమతి, కూరాకుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.