వెల్దుర్తి, మే 25: ఈటల రాజేందర్కు చెందిన ‘జమున హ్యాచరీస్’ వారు తమ భూములను కబ్జాచేశారని, ఎటువంటి సమాచారం లేకుండా రోడ్డు వేసి ఆక్రమించారని, విక్రయించిన భూమికి పూర్తి డబ్బులు ఇవ్వలేదని పలువురు రైతులు రెవెన్యూ అధికారులకు వివరణ ఇచ్చారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివారులో జమున హ్యాచరీస్ పరిశ్రమ నిరుపేదల అసైన్డ్ భూముల కబ్జాపై రెవెన్యూ అధికారుల విచారణ కొనసాగుతున్నది. ఈ క్రమంలో కబ్జాకు గురైనట్టు గుర్తించిన సర్వే నంబర్లలోని సంబంధిత రైతులైన 75 మందికి కబ్జాపై వివరణ ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం అధికారులు నోటీసులు జారీచేశారు. నోటీసులపై స్పందించిన పలువురు రైతులు మంగళవారం మాసాయిపేట తాసిల్ కార్యాలయానికి వచ్చి లిఖిత పూర్వకంగా తమ వివరణను తాసిల్దార్ మాలతికి అందజేశారు. పలువురు రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. వివరణలో భాగంగా అధిక సంఖ్యలో రైతులు తాము భూములను ఎవరికీ విక్రయించలేదని, జమున హ్యాచరీస్ పరిశ్రమవారు తమ భూములను కబ్జా చేసి పలు నిర్మాణాలు చేపట్టడంతోపాటు ఇతర పనులకు వినియోగించుకొంటున్నారని, మరికొందరు రైతులు తమకు ఎలాంటి సమాచారం లేకుండానే తమ భూముల్లో నుంచి రోడ్డు నిర్మించి ఆక్రమించారని, తమ భూముల వద్దకు వెళ్లకుండా కంచె, గేటు ఏర్పాటుచేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇంకొదరు రైతులు రెవెన్యూ అధికారులకు వివరణ ఇచ్చారు. గతంలో ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలాల్లో పూర్తిస్థాయి సర్వే చేపట్టి తమ భూములను తమకు అప్పగించాలని వివరణలో కోరినట్టు సమాచారం. తాము విక్రయించిన భూములకు పూర్తిగా డబ్బులు చెల్లించలేదని, తమకు మిగిలిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని మరికొందరు రైతులు వివరణ ఇచ్చారు.