మహబూబ్నగర్: మహాబూబ్నగర్ జిల్లాలో నకిలీ బంగారం కుదువపెట్టి లక్షల్లో రుణాలు తీసుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ డీఎస్పీ శ్రీధర్ జడ్చర్ల పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మతంగి వరప్రసాద్ అనే వ్యక్తి గతంలో తెలంగాణ హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసేవాడు.
అయితే, చెడు అలవాట్ల కారణంగా డ్యూటీలకు సరిగా వెళ్లకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో సులువుగా డబ్బులు సంపాదించి ఎంజాయ్ చేయడం కోసం నకిలీ పేర్లతో ఆధార్, పాన్ కార్డులు సృష్టించుకుని నకిలీ బంగారాన్ని మణప్పురం ఫైనాన్స్లో తాకట్టుపెట్టి లోన్స్ ఎగ్గొట్టడం మొదలెట్టాడు. ఆగ్రాకు చెందిన వినోద్, సికిందర్ అనే ఇద్దరు బంగారం పూత వేసే వ్యక్తులను పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు.
ఇప్పటివరకు కర్నూలు, ప్రకాశం, చిలుకలూరిపేట, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లోని మణప్పురం ఫైనాన్స్లలో రూ.58 లక్షల రుణాలు తీసుకున్నాడు. ఇదే తరహాలో జడ్చర్లలోని మణప్పురం ఫైనాన్స్లో గత నెల 25న నకిలీ ఆధార్తో లోన్ కోసం వచ్చాడు. ఫైనాన్స్ సిబ్బందికి అనుమానం రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఫైనాన్స్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం హైదరాబాద్లోని అత్తపూర్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదేగాక గతంలో కూడా నిందితుడికి నేర చరిత్ర ఉన్నదని పోలీసులు తెలిపారు. 2016లో హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కంపెనీ పెట్టిస్తానని ఒకరిని మోసం చేశాడు. ఆలాగే 2019లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన కేసుల్లో జైలుకెళ్ళి బెయిల్ పై బయటకు వచ్చాడు. కాగా, పట్టుబడ్డ నిందితుడి నుంచి 45 నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.