అమీర్పేట్, జూలై 21: అర్చక ఉద్యోగుల సమ్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కటాఫ్ తేదీని తొలగించి జీవో 577 ప్రకారం ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ జీఐఏ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరింది. ఈ మేరకు జేఏసీ సభ్యులు పరాశరం రవీంద్రాచార్యులు, కాండూని కృష్ణమాచార్యులు బుధవారం ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి వినతిపత్రం సమర్పించారు. అర్చక ఉద్యోగుల సమస్యలపై దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశం నిర్వహించి తమ న్యాయపరమైన హక్కులపై చర్చించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.