వరంగల్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ దవాఖానల్లోనే వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, కరోనా సమయంలో నాణ్యమైన చికిత్స అందుతున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎంలో బ్లాక్ ఫంగస్ బాధితులకు సేవలందించేందుకు 50 బెడ్లతో ఏర్పాటుచేసిన ప్రత్యేక వార్డును శనివారం మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఎంజీఎంలో వైద్య సేవలు, మందుల సరఫరాపై వైద్యాధికారులు, డాక్టర్లతో సమీక్షించారు. ఎంజీఎంలో అందుతున్న వైద్యసేవలపై ప్రజలకు నమ్మకం కలుగుతున్నదని, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఖాళీ పడకలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎంజీఎం సూపరింటెండెంట్ వీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.