బీజేపీని తిట్టి.. ఎట్ల చేరినవ్?
ఈటలకు గుణపాఠం తప్పదు: మంత్రి కొప్పుల
జమ్మికుంట, జూన్ 17: ఈటల రాజేందర్ది ఆత్మగౌరవం కాదని, ఆత్మవంచన అని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. తన వ్యక్తిగత విషయాలను ప్రజలపై రుద్దుతున్నాడని మండిపడ్డారు. ప్రజలను భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యాడని దుయ్యబట్టారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో ఎంపీఆర్ గార్డెన్లో టీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి కొప్పుల మాట్లాడారు. పార్టీలో పదవులన్నీ అనుభవించిన ఈటల, టీఆర్ఎస్ను ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్నటి దాకా నల్ల చట్టాలు.. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టిన విషయాలను మరిచిపోయావా?అని నిలదీశారు. ‘నీకొక్కడికే ఆత్మ గౌరవం ఉందా..? మేము కూడా పార్టీలో నీతోనే పనిచేశాం కదా..నీకు అన్యాయం జరిగిందని ఏనాడూ చెప్పలేదు కదా?’ అని ప్రశ్నించారు. మతతత్వ పార్టీలో చేరిన ఈటలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీసీసీబీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, సీనియర్ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు తదితరులు పాల్గొన్నారు.