మన్సూరాబాద్, జూన్ 28: ఫీజుల విషయంలో విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హెచ్చరించారు. నాగోల్ డివిజన్ కోఆపరేటివ్ బ్యాంకు కాలనీలోని కమ్యూనిటీ హాల్లో సోమవారం నియోజవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్ రావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజుల కోసం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. కరోనా కారణంగా ఎంతో మంది తమ జీవనోపాధిని కోల్పోయారని తెలిపారు. నారాయణ, శ్రీచైతన్య, గాయత్రి పాఠశాలల యాజమాన్యాలు వేధింపులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఫీజుల వివరాలతో కూడిన బోర్డును ప్రతి పాఠశాల బయట ఏర్పాటు చేయాలని సూచించారు.
విద్యాశాఖ అధికారులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో తనిఖీలు చేసి యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని ప్రతి ఉపాధ్యాయుడికి రూ. 2వేల ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల బియ్యం అందజేస్తుందని తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు కోరిన విధంగా కరెంటు, వాటర్ బిల్లులతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా విద్యా శాఖాధికారి సుశీంధర్ రావు, సరూర్నగర్ ఎంఈఓ కృష్ణ, ట్రెస్మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె వినయ్కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్రెడ్డి, నాయకులు చెరుకు ప్రశాంత్గౌడ్, అనంతుల రాజిరెడ్డి, తూర్పాటి చిరంజీవి, సతీష్యాదవ్, మొగిళ్ల జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.