హైదరాబాద్ : శారీరక, మానసిక పరిమితులకు అతీతంగా సాధకునికి అవసరమైన మార్గదర్శనం చేస్తూ ఆంజనేయస్వామివారి మంత్రమయ గ్రంధాన్ని ‘ జయఘోష’ గా అందించే భాగ్యం తనకు కలగడం కొండగట్టు ఆంజనేయస్వామి అనుగ్రహమేనని నిజామాబాద్ ఎమ్మెల్సీ ,తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శ్రీ శృంగేరిపీఠం జ్ఞానసరస్వతి దేవాలయం ధర్మాధికారి, త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి సమర్పణలో ‘జయఘోష’ లక్ష ప్రతులను ఎమ్మెల్సీ కవితకు ఉచితంగా అందించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ మంత్రగ్రంథ నిర్మాణాన్ని అత్యంత వైభవంగా అందించడం ప్రత్యేక విశేషంగా పేర్కొన్నారు. లక్ష పుస్తకాలను అందజేసి, గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన పురాణపండ శ్రీనివాస్ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. లక్ష ‘జయఘోష’ పుస్తకాలను కొండగట్టు అంజన్న సన్నిధానానికి పంపనున్నట్లు తెలిపారు.
కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న విశేష అనుగ్రహంగానే కల్వకుంట్ల కవిత నేతృత్వంలో గత నలభై రోజులపాటు తెలంగాణ అంతటా హనుమాన్ చాలీసా ప్రతిధ్వనించిందన్నారు. ‘పరాశర సంహిత’ ఆధారంగా ఈ మంత్ర తంత్రాత్మకమైన హనుమాన్ స్తోత్ర, వ్యాఖ్యానాలను ఇలా ‘జయఘోషగా’ అందివ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవీ ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.