హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మరో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని, ఆ లోటును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చగలరని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీని ఆయన స్వాగతించారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో భూమన్ ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన అభిప్రాయాలు.. ఆయన మాటల్లోనే..
2024లో బీజేపీని రానివొద్దు
కేంద్రంలో బీజేపీ పాలనలో ఏం జరిగిందో చూశాం. స్వేచ్ఛ లేకుండా మతం పేర కొనసాగుతున్న ఘోరాలు చూశాం. 2024లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామికవాదులు పూర్తిగా కనుమరుగవుతారు. దేశంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలి. సమకాలీన పరిస్థితులు, తాజా రాజకీయ వాతావరణాన్ని గుర్తెరిగి ఇతర ప్రాంతీయ పార్టీలు కేసీఆర్తో కలిసి రావాలి. అవసరమైతే కాంగ్రెస్ కూడా ఈ దిశగా అడుగులేయాలి. మోదీని ఢీకొట్టే సత్తా ఉన్న కేసీఆర్కు అంతా అండగా నిలవాలి. కేసీఆర్ ఆలోచనలతో దేశానికి మంచి జరుగుతుంది.
కేంద్రానికి బానిసలన్నట్టుగా..
మనది ఫెడరల్ ప్రభుత్వమన్న ఆలోచనను బీజేపీ విస్మరిస్తున్నది. రాష్ర్టాలు, పార్టీలన్నీ తమ బానిసలన్నట్టుగా వ్యవహరిస్తున్నది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ర్టాలను సంప్రదించకుండానే కేంద్రం కలగజేసుకొంటున్నది. ఇది దేశానికి, ప్రజస్వామ్యానికి మంచిదికాదు. ఫెడరల్ భావనను పటిష్టం చేసే ఆలోచన గల ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలి. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి అనన్య సామాన్యం. నేను ఇటీవల తెలంగాణలో తిరిగితే నాకే ఆశ్చర్యమేసింది. కోస్తా జిల్లాల్లో అమ్మినట్టుగా ఊర్లల్లో వీధుల్లో చేపలు, రొయ్యలు అమ్ముతుండటం చూసి ఎంతో సంతోషించాం. గుజరాత్ మాడల్ విఫలమయ్యింది. తెలంగాణ మాడల్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు దేశానికి కావాల్సింది తెలంగాణ అభివృద్ధి నమూనా.