షాద్నగర్రూరల్ : స్నేహానికన్న మిన్న లోకాన ఏది లేదురా.. అని ఓ సినీ కవి చెప్పింది అక్షర సత్యం ! కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న మిత్రుడిని చూసి కొందరు స్నేహితులు చలించిపోయారు. నిలువ నీడ లేకుండా ఉన్న స్నేహితుడి కష్టాలను తీర్చేందుకు తలా కొన్ని డబ్బులు పోగు చేసి.. ఒక ఇంటిని కట్టించి ఇచ్చారు.. తమ స్నేహం విలువను చాటి చెప్పారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని చించోడ్ గ్రామంలో చోటుచేసుకుంది.
చించోడ్ గ్రామానికి చెందిన 1993-94సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఇటీవల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నారు. ఆ కార్యక్రమంలో స్నేహితులందరూ ఒకరికొకరు తమ బాధలు, సంతోషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో శ్రీనివాసాచారి అనే మిత్రుడి ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరిందని.. కనీసం బాత్రూం సౌకర్యం కూడా లేక ఇబ్బంది పడుతున్నాడన్న విషయాన్ని తెలుసుకున్నారు. తమ స్నేహితుడి దీనస్థితి తెలిసిన తోటి మిత్రులు చలించిపోయారు. కష్టాల్లో ఉన్న అతడిని ఆదుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో స్నేహితులంతా చందా వేసుకుని ఇంటిని కట్టించారు. ఇటీవల శ్రీనివాసాచారితో గృహ ప్రవేశం కూడా చేయించారు. తమ బ్యాచ్లో ఏ స్నేహితుడు ఆపదలో ఉన్న అవసరమైన సాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా వారు ప్రతిజ్ఞబూనారు.