హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ నీటి తగాదాలను తీర్చాల్సిన కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) ఏకపక్షంగా ఏపీ పక్షం వహిస్తున్నది. ప్రతి విషయంలోనూ తెలంగాణకు నై అంటూ.. ఏపీకి సై అంటున్నది. బుధవారం జరిగిన బోర్డు మీటింగ్లోనూ అదేతీరుగా వ్యవహరించింది. కేఆర్ఎంబీ 14వ మీటింగ్ బుధవారం జలసౌధలో చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగింది. భేటీలో ముందుగా కృష్ణాజలాల వినియోగం, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి, క్యారీఓవర్ వాటర్ తదితర ఎజెండా అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వానికి వత్తాసు పలికేలా నిర్ణయాలు తీసుకుంటుండడంతో తెలంగాణ సాగునీటి, ఆయకట్టు అభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్కుమార్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. దీంతో బోర్డు సమావేశం అర్ధంతరంగా ముగిసింది. అనంతరం కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్ అమలుకు కావాల్సిన సంస్థాగత వ్యవస్థ నిర్మాణంపై జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి. సమావేశంలో జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీల చైర్మన్లు చంద్రశేఖర్ అయ్యర్, ఎంపీ సింగ్, బోర్డు మెంబర్ సెక్రటరీలు, మెంబర్లు, తెలంగాణ, ఏపీ అధికారులు పాల్గొన్నారు.
నీటివాటాపై రాజీలేదు
కృష్ణాజలాల్లో రాష్ర్టానికి దక్కాల్సిన న్యాయమైన వా టాపై రాజీపడే ప్రసక్తే లేదని, శ్రీశైలంలో విద్యు దుత్పత్తిని ఆపేది లేదని తెలంగాణ తేల్చిచెప్పింది. ఎత్తిపోతల పథకాలు, బోరుబావులకుతెలంగాణకు జలవిద్యుత్తు అత్యవసరమని, శ్రీశైలం జల విద్యుత్తు కోసమే నిర్మించిన ప్రాజెక్టుఅని అధికారులు పేర్కొన్నారు. దీనిపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ కూడా ఏపీకి వత్తాసు పలికే లా మాట్లాడారు. దీంతో రజత్కుమార్ తీవ్రఅసహ నం వ్యక్తంచేస్తూ భేటీ నుంచి బయటకు వచ్చారు.